జేపీ నడ్డా తో పవన్ భేటీ
న్యూఢిల్లీ, జనవరి 13,
ఢిల్లీ పర్యటనలో బిజీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రెండు రోజులుగా హస్తినలోనే ఉన్న జనసేనాని.. సోమవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేసీ నడ్డాతో సమావేశమయ్యారు. నడ్డా నివాసంలో జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్తో కలిసిన ఆయన.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని అంశంపై వారితో ప్రస్తావించినట్లు సమాచారం. నడ్డాతో పాటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్యలు కూడా ఈ భేటీలో ఉన్నారు.ఇదిలా ఉంటే శనివారం ఢిల్లీకి వెళ్లిన పవన్ పలువురు ప్రముఖుల్ని కలిసినట్లు తెలుస్తోంది. నడ్డాను కలవక ముందు పలువురు ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై జనసేన వర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. జనసేనాని ఉన్నట్టుండి జేపీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యింది. అయితే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందా అనే ప్రచారం మొదలయ్యింది. ఈ మేరకు నడ్డాతో పవన్ చర్చలు జరిపారనే ఊహాగానాలు మొదలయ్యాయి.జేపీ నడ్డాను కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి ఏపీకి తిరుగు పయనమయ్యారు. ఆయన నేరుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళతారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎపిసోడ్ను సీరియస్గా తీసుకున్న పవన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వెళతానని ట్వీట్ చేశారు. చెప్పినట్లుగానే జనసేనాని సాయంత్రానికి కాకినాడ చేరుకుంటారని చెబుతున్నారు. కానీ జనసేన పార్టీ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.