వైసీపీ నేతల మౌనం వెనుక...
గుంటూరు, జనవరి 14,
నిజమే… అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. రాజధానుల ఏర్పాటుపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి వారి అనుకూల మీడియాల్లో జోరెత్తుతోంది. పావలాని ముప్పావలాగా చేసి చూపిస్తున్నారు. అదే సమయంలో తమకు కూడా రాజధానులు కావాలంటూ అటు సీమలోనూ ఇటు విశాఖలోనూ కూడా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అయితే, చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం వీటిని ఎట్టి పరిస్థితిలోనూ ఫోకస్ చేయడం లేదు. మరి ఇంత ఇదిగా రాష్ట్రంలో పరిస్థితి ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.అమరావతి ప్రాంతంలో అంటే ప్రజలు సెంటిమెంటుతో రోడ్డెక్కారు కాబట్టి ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మౌనంగా ఉన్నారని అనడంలో అర్ధం ఉంటుంది. కానీ, విశాఖ, కర్నూలు సహా ఇతర ప్రాంతాల్లో ఎందుకు వైసీపీ నాయకులు ప్రభుత్వ వాయిస్కు మద్దతుగా రోడ్డెక్కి ప్రతిపక్షాలను ఎండగట్టడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా పెద్దగా బలం లేదని అనుకుంటున్నారా ? ఏంటి ఆయనను పట్టించుకునేదని భావిస్తున్నారా ? నిజమే ఎన్నికల్లో ఆయనకు 23 మంది గెలిచారు. ఇప్పుడు 21 మంది మాత్రమే మిగిలారు. కాబట్టి మేం ఆయనకు కౌంటర్ ఇచ్చేది ఏంటని ఉదాసీనంగా ఉన్నారా ? అయితే, పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఒక్కసారి ఏదైనా వాయిస్ ప్రజల్లోకి వెళ్తే ఇక, అంతే. నరనరానా జీర్ణించుకు పోతుంది.మరి ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలి. ఇక, ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల్లోని వైసీపీ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఇక్కడి ప్రజలు తమకు అభివృద్ది ఫలాలు అందాలని, తాము కూడా సమాంతరంగా అభివృద్ధి సాధించాలని కోరుతూ రోడ్డెక్కుతున్నారు. కానీ, ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ప్రభుత్వ వ్యూహాన్నిప్రజల్లోకి తీసుకు వెళ్లలేక పోతున్నారు. ఉత్తరాంధ్రలో మిగిలిన పార్టీల నాయకులు స్వాగతిస్తున్నారు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం రోడ్లమీదకు వచ్చింది లేదు. ప్రజలకు వివరించింది కూడా లేదు. ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోని పక్షంలో వైసీపీ ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.