ఓఆర్ఆర్ పై ఫలితాలినిస్తున్న స్పీడ్ గన్స్
స్పీడ్ చలాన్లతో కోట్ల ఆదాయం
హైద్రాబాద్, జనవరి 14,
దరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో పాటు రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి రోజు సగటున 2,600 స్పీడ్ గన్స్ పేలుతున్నాయి. సగటున నిమిషానికి రెండు కేసులు నమోదుచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసు విభాగం ఎక్కుపెట్టిన ఈ గన్లు రోజూ కోట్ల రూపాయల్లో సర్కారుకు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. అదే టైంలో హైవేలపైకి ఎక్కాలంటేనే అయ్య బాబోయ్.. అన్నట్లుగా వాహనదారులను భయపెడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని హైవేలపై పోలీసులు స్పీడ్ గన్ లతో నీడలా వెంటాడుతున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే స్పీడ్ జరిమానాలతో రాష్ట్ర ఖజానాకు రూ. 54 కోట్లకు పైగా ఆదాయం జనరేట్ అయింది.ఓఆర్ఆర్పై గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ను నిర్దేశించారు. హైవేల మీద గంటకు 80 కిలోమీటర్లు, నగరాల పరిధిలో లారీ వంటి భారీ వాహనాలకు 30 కిలోమీటర్ల స్పీడ్, కార్లు, ఇతర వెహికల్స్కు 50 కిలోమీటర్ల స్పీడ్ నిర్ణయించారు. అంతకుమించి వేగంతో వెళ్లే వాటిని స్పీడ్ లేజర్ గన్లతో పోలీసులు ఫొటోలు తీసి ఫైన్లు వేస్తున్నారు. మినిమం రూ. వెయ్యి చలానా వేస్తున్నారు. ఓఆర్ఆర్పై ఆటోమేటిక్ లేజర్ గన్లు, ఇతర రహదారుల్లో మాన్యువల్గా స్పీడ్ గన్లు ఉపయోగిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రోడ్లు ఖాళీగా ఉన్న టైంలో స్పీడ్ పెంచితే ఈజీగా దొరికిపోతున్నారు.కోట్లల్లో ఆదాయం వస్తుండటంతో.. అన్ని కమిషనరేట్లు, జిల్లాల పోలీసు అధికారులు ఒకరికి మించి ఒకరు హై స్పీడ్ చలాన్లను జనరేట్ చేసేందుకు పోటీ పడుతున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఓఆర్ఆర్పైనే గత ఏడాదిలో రోజుకు సగటున 900 కేసులు బుక్కయ్యాయి. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో 4 నెలల్లో వేలాది కేసులు బుక్ చేశారు. హైదరాబాద్-–వరంగల్ హైవేపై ఆరు నెలల్లోనే 43 వేల కేసులు నమోదు చేసి.. రూ.4.53 కోట్ల స్పీడ్ ఫైన్లు విధించారు. విజయవాడ హైవే మీదున్న సూర్యాపేట జిల్లాలో రూ.1.15 కోట్ల జరిమానాలు విధించారు. రాజీవ్ రహదారిపై ఫైన్ల మోత మోగుతోంది. రాచకొండ, సిద్దిపేట, కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు లెక్కలేనన్ని కేసులు పెడుతున్నారు. దీంతో ఒక్కో వాహనంపై ఒకే రోజున రెండు, మూడు ఫైన్లు పడుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘స్పీడ్ చలాన్లతో కోట్ల ఆదాయం వస్తోంది. ఎన్ని కేసులు నమోదయ్యాయో చెబితే వెహికల్ ఓనర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది’ అని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీస్ ఆఫీసర్ గణాంకాలు చెప్పకుండా దాటవేశారు.హైదరాబాద్ నుంచి వివిధ నగరాలు, పట్టణాలకు వెళ్లే రహదారులపై రోజూ సుమారు 20 లక్షల వాహనాలు ట్రావెల్ చేస్తున్నాయి. వీటిలో అత్యధికంగా 12 లక్షల కార్లు, మిగతావి గూడ్స్ ట్రక్కులు, భారీ వాహనాలున్నాయి. స్పీడ్ జరిమానాలు నమోదవుతున్న వాటిలో 87 శాతం కార్లు, 8 శాతం లారీలు, 5 శాతం ఆర్టీసీ బస్సులు ఉన్నాయని రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు లెక్కగట్టారు. ప్రధానంగా ముంబై, బెంగుళూర్, నాగ్పూర్, విజయవాడ హైవేలతో పాటు రాజీవ్ రహదారిపై వెహికిల్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్ మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 బ్లాక్ స్పాట్స్ గుర్తించింది. ఇలాంటి ప్రాంతాల్లో వెహికిల్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు స్పీడ్ గన్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో 32 స్పీడ్ గన్స్ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 68కు చేరింది. కొన్ని రహదారులపై రెండు మూడు పోలీస్ సర్కిళ్లుండటం వాహనదారులకు మరింత శాపంగా మారింది. ఒకే రోజు ఒక వాహనంపై రెండు మూడు చోట్ల కేసులు బుక్కవుతున్నాయి.రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ గన్ తో జరిమానాలు విధిస్తున్న పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్.. అందుకు తగినట్టుగా వాహనదారులకు అవగాహన కల్పించడం లేదు. హైవేలు, జిల్లాల రోడ్లపై ప్రమాదకర ప్రాంతాల్లో సైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులను నామ్కే వాస్తేగా ఏర్పాటు చేస్తున్నారు. అవి వాహనాల్లో వెళ్లేవారికి సరిగా కనిపించని పరిస్థితి ఉంది.రహదారులపై అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఇతర కారణాల వల్ల రాష్ట్రంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని పోలీసు విభాగం ఏటేటా హెచ్చరిస్తోంది. ఎన్సీఆర్బీ వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2018లో 2,230 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 6,603 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. స్పీడ్ గన్లు అమర్చిన తర్వాత ప్రమాదాలు 15 శాతం వరకు తగ్గినట్టు పోలీసులు చెప్తున్నారు.