20 నుంచి అసెంబ్లీ.. రాజధాని భవిత తేలేది ఆ రోజే!
విజయవాడ జనవరి 14
జగన్ సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని వ్యవహారాన్ని తేల్చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 20న ఉదయం 9.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మంత్రివర్గ సమావేశంలోనే రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.హైపవర్ కమిటీ నివేదికతో పాటూ సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని అంశంపై సభలో చర్చించనున్నారు. మూడు రోజుల చర్చ తర్వాత హైపవర్ కమిటీ నివేదికకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో వచ్చే వారంలో రాజధాని అంశంపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు ఈ నెల 17న ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ భేటీకానుంది. ఇప్పటికే మూడుసార్లు భేటీ నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. మొదటిసారి జరిగిన భేటీలో జీఎన్ రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై కమిటీ చర్చించింది. రెండోసారి జరిగిన సమావేశంలో.. రైతుల ఆందోళనలు, డిమాండ్లు, సచివాలయ ఉద్యోగులు, జిల్లాల అభివృద్ధితో పాటూ పలు కీలక అంశాలపై చర్చించారు. మూడోసారి జరిగిన సమావేశంలో రాజధాని రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పదలచుకున్నారో.. రాతపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్కు 17లోగా అందజేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మెయిల్ ద్వారా సూచనలు, సందేహాలు పంపించాలని కోరారు. వాటిని కూడా కమిటీ పరిశీలించనుంది.