సాధ్వికి వార్నింగ్
భోపాల్, జనవరి 14
సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు పంపిన లేఖ సంచలనం అయింది. ఎందుకంటే, భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్కు విష రసాయనాలతో కూడిన లెటర్ను గుర్తు తెలియని వ్యక్తులు పంపారు. ప్రజ్ఞ ఇంటికి ఒక కవర్ పోస్టు ద్వారా వచ్చింది. దానిని స్వీకరించిన ఆమె కార్యదర్శి తెరిచి చూడగా, అందులో కొన్ని హెచ్చరికలతో పాటు, కొంత పౌడర్ కూడా ఉండడం గుర్తించారు. ఆ లెటర్ను పట్టుకున్న సెక్రటరీకి చేతులకు దురదలు మొదలయ్యాయి. సెక్రటరీ ఈ విషయాన్ని వెంటనే సాద్వీకి తెలపడంతో, ఆమె భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజ్ఞా సింగ్ చేసిన ఫిర్యాదు అందుకున్నామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భోపాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇర్షాద్ వలీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం పరిశీలనకు ఆ లేఖతోపాటు కవరు పంపామని, వారి నుంచి వచ్చాకే అందులో ఏ పదార్థాలున్నాయనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు. అయితే, తనకు గతంలోనూ ఇలాంటి బెదిరింపు లేఖలు వచ్చాయని సాధ్వీ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు పంపిన లెటర్లో ఏదో విషపూరిత పౌడర్ ఉందని ఆమె తెలిపారు.