రైతుల చిట్టా విప్పే పనిలో సర్కార్
గుంటూరు, జనవరి 16,
అమరావతి రాజధాని ప్రాంతంలో నిజమైన రైతులు ఎవరు ? వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టి రైతుల పేరిట వారినోట్లో మట్టి కొట్టింది ఎవరు ? ఇదే ఇప్పుడు వైసీపీ సర్కార్ కి ఛాలెంజ్ గా నిలిచిన అంశం. పాలు – నీరు వేరు చేస్తే రైతుల సమస్యకు పరిష్కారం లభించినట్లే అని జగన్ నియమించిన హై పవర్ కమిటీ భావిస్తుండటంతో దీనిపై కూడా టిడిపి పెద్ద ఎత్తున రచ్చ మొదలు పెట్టె అవకాశాలే కనిపిస్తున్నాయి. అమరావతిలో భూముల ధరలకు రెక్కలు వచ్చి తాము పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదిద్దాం అన్న ఆశ పడేవారి కి మాత్రం చేదు గుళికలు మింగించాలన్నదే సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం అవుతుంది.అమరావతిలో రాజధాని ప్రకటించకముందు అంటే 2014 లో భూములు కలిగి వున్న వారి చిట్టా విప్పే పనిలో ఇప్పటికే అధికార యంత్రాంగం పడింది. ఆ లెక్కలు తేలితే ప్రస్తుత రైతు ఉద్యమాన్ని చాలావరకు చల్లార్చాలని అలాగే ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన వారు చేసే ఆందోళనకు విలువ ఇవ్వలిసిన పనిలేదన్నది సర్కారీ వ్యూహం గా తేలుతుంది. రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్ లు అక్కడే ఇవ్వడం సాధ్యం కాదు కనుక వారికి నష్టం లేకుండా కోరిన న్యాయమైన కోర్కెలు తీర్చేందుకు కమిటీ సూచనలు చేసింది.చంద్రబాబు ఏర్పాటు చేసిన సీఆర్డీఏ ను రద్దు చేస్తే సరిపోతుందని చట్టపరంగా వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని హై పవర్ కమిటీ సూచించినట్లు సమాచారం. అమరావతి అభివృద్ధి మండలి ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీ అభిప్రాయపడింది అంటున్నారు. అయితే రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులను పూర్తి స్థాయిలో బుజ్జగించే ఫార్ములా పై ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు సాగుతూనే వుంది. దీనికోసం మరికొన్ని సార్లు హై పవర్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించడంతో త్వరలోనే జగన్ ఈ సమస్యకు పరిష్కారం కనిపెడతారా? లేక రాజకీయ ఎత్తుగడలకే ప్రాధాన్యం ఇస్తారా అన్నది వేచి చూడాలి. అమరావతి ఖర్చెంత....అద్దె భవనాలు.. తాత్కాలిక కట్టడాలు….ఏపీ రాజధాని అమరావతికి అయిన ఖర్చెంత? ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్న తీవ్రమైన అంశం ఇదే. నిజానికి ఇద్దరు వ్యక్తులే కాదు.. ఎక్కడికక్కడ జరుగుతున్న చర్చ కూడా ఇదే. ప్రస్తుతం మూడు రాజధానులను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అని అధికార వైసీపీ మంత్రుల నుంచి నాయకులను ఎవరిని అడిగినా అమ్మో.. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది కాబట్టి.. మేం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదికి తెచ్చాం. అయినా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు ఎక్కడ? ఉన్నా మాత్రం ఇంత సొమ్మును ఒకే చోట కుమ్మరిస్తే ఎట్టా? అని సమాధానం వస్తోంది. దీంతో నిజమేనా? అమరావతి రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతాయా? సామాన్యులు బుగ్గలు నొక్కుకుంటున్నారు.మరి ఇదే విషయాన్ని ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పరివారాన్ని ప్రశ్నిస్తే.. భిన్నమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో రూ.లక్ష కోట్ల విలువైన రాజధానిని నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఇక, అధికారం కోల్పోయాక కూడా ఇదే కొన్ని రోజులు వెల్లడించారు. అయితే, రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ విన్నాక.. ఒక్కసారిగా చంద్రబాబు సహా తమ్ముళ్ల నోళ్లు తడబడ్డాయి. తూచ్… లక్ష కోట్లతో ఇప్పుడు పనిలేదు. ఇప్పుడు రూ.10 వేల కోట్లుంటే చాలు.. అని ఆదిలో చెప్పారు. రోజులు గడిచి అమరావతికి ప్రాణసంకటం ఉందని తెలుస్తుండడంతో అస్సలు పైసా కూడా ఖర్చులేదని ఇక్కడే అన్నీ కట్టి ఉన్నాయని కాబట్టి ఇదే రాజధానిగా కొనసాగాలని డిమాండ్లు చేస్తున్నారు.ఇక, చంద్రబాబు అనుకూల మీడియాలోనూ భిన్నమైన కథనాలు వస్తున్నాయి. బాబు వాయిస్నే పరోక్షంగా కథనాల రూపంలో ఇవి వెల్లడిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజల్లో అసలు ఈ రాజధాని విషయం ఏంటనే చర్చ వస్తోంది. ఒక్కసారి వాస్తవంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఉన్న భవనాల్లో చాలా మటుకు శాఖలకు ఉన్నవన్నీ.. కూ డా విజయవాడ, మంగళగిరి, గుంటుపల్లి, గుంటూరు తదితర ప్రాంతాల్లో అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి . ఇక, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వంటివి చంద్రబాబు హయాంలోనే నిర్మించినా.. వాటిని తాత్కాలిక కట్టడాలుగానే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శాశ్వత కట్టడాలకు పునాదులు వేశారు.ఇక, కేంద్రం నుంచి ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న రాజధానికి నిధులు ఇప్పటి వరకు వచ్చింది కేవలం రు. 2500 కోట్లు మాత్రమే. ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున కేంద్రం ఇచ్చింది. ఇక, గ్రాంటు రూపంలో మరో రు. 500 కోట్లుఇచ్చింది. మొత్తంగా చూస్తే.. కేంద్రం ఇచ్చింది రు. 2500 కోట్లు దాటదు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హయాంలో మొత్తంగా చేసిన ఖర్చు రు. 5300 కోట్లు. ఇక, రైతుల భూముల విషయంలో చేసుకున్న ఒప్పందాలు, బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు వంటివి భారీ ఎత్తున పేరుకు పోయాయి. వాస్తవానికి గత ప్రభుత్వం రాజధాని పేరుతో తీసుకువచ్చిన రుణం అక్షరాలా రు. 9 వేల కోట్లు. మరి ఈ సొమ్ములో రాజధానికి ఖర్చు పెట్టింది సగం కూడాలేదు. పోనీ.. ఇప్పటికిప్పుడు చంద్రబాబు చెబుతున్నట్టు ఉన్నవాటితో సర్దుకుపోదామంటే సాధ్యమయ్యే పనికాదు.చుట్టూ విశాలమైన ఖాళీ స్థలాలు.. రోడ్డు అసంపూర్ణం.. అభివృద్ధి అసంపూర్ణం.. నీటికి ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలున్నాయి. కొనసాగించాలన్నా కనీసం రు. 25 వేల కోట్లు ఇప్పటికిప్పుడు కావాలి. ఇంత మొత్తం ఇచ్చేదెవరు ? ఇక, పరిశ్రమలు, ఐటీ వంటివి కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం నిజంగానే కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న మాట. పైగా ప్రభుత్వం సేకరించిన భూమిలో ఇప్పటి వరకు పనులు జరుగుతున్నది కేవలం 10శాతంలో మాత్రమే కావడం కూడా గమనార్హం. సో.. మొత్తానికి పైకి జరుగుతున్న ప్రచారానికీ.. క్షేత్రస్థాయి పరిశీలనకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది.