77 స్థానాల్లో గులాబీ ఏకగ్రీవం
హైద్రాబాద్, జనవరి 16
మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అదే జోరు కనబరుస్తోంది. ఏకపక్షంగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఎన్నిక లేకుండానే పలు స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మూడు మినహా అన్ని స్థానాలను టీఆర్ఎస్ పార్టే దక్కించుకోవడం విశేషం. ఆ మిగిలిన మూడు స్థానాలను కూడా ఎంఐఎం కైవసం చేసుకోవడం గమనార్హం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు పలు స్థానాల్లో అభ్యర్థులే లేకపోవడం శోచనీయం.మున్సిపల్ సంఘాల్లో 2727 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కార్పొరేషన్లలో 325 డివిజన్లకు 324 డివిజన్లకు ఎన్నికలు జరగుతుండగా.. వీటిలో ఒక స్థానాన్ని టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ను అధికార పార్టీ కైవసం చేసుకుంది.పరకాలలో 22 వార్డులుండగా.. 11 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. చెన్నూరులో 7 వార్డులు, సత్తుపల్లిలో 6, మేడ్చల్లో 5, రంగారెడ్డి జిల్లాలో 3 వార్డులు టీఆర్ఎస్కు దక్కాయి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో 4 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. బీఫారాలు దక్కకపోవడంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు.ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో అత్యధికంగా 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 13 స్థానాల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 9 చొప్పున, ఖమ్మంలో 7, మహబూబ్నగర్ జిల్లాలో 4, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 3 స్థానాల చొప్పున ఏకగ్రీవమయ్యాయి.మొత్తం మీద జనవరి 22న ఎన్నికలు జరిగే 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం (జనవరి 14) పలు చోట్ల నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ టికెట్ దక్కకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అభ్యర్థుల బీఫారాలు చించివేశారు. కొంత మంది ఆత్మహత్యాయత్నం చేశారు. మరి కొంత మంది నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుజ్జగింపులు, సముదాయింపులు, భవిష్యత్తు అవకాశాలను ఆశగా చూపి తిరుగుబాటు అభ్యర్థులను విరమింపజేసేందుకు టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. పోటాపోటీగా ఉన్న పలు చోట్ల స్వతంత్రులతోనూ నామినేషన్లు ఉపసంహరింపజేయడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.