2024 లో జనసేనతో కలిసి ఏపిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు: సునీల్ దేవధర్
అమరావతి జనవరి 16
: ఏపీ రాజకీయాల్లో నేడు ఓ చారిత్రక దినమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ సునీల్ దేవధర్ అన్నారు. సుపరిపాలన అందించడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు ఘోరంగా విఫలం చెందారని ఆయన ధ్వజమెత్తారు. కుటుంబ పాలన, అవినీతి పాలనను అంతం చేయడానికి ఓ జట్టుగా ముందుకు సాగుతామని తెలిపారు. బీజేపీ, జనసేన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని చీకటిని తరిమికొట్టి, ప్రజల జీవితాల్లో వెలుతురును నింపుతామని, అందుకే కలిసి నడవాలని నిశ్చయించుకున్నామని అన్నారు. 2024 లో జనసేనతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెర వెనుక గానీ, ముందుగానీ టీడీపీ, వైసీపీతో ఎలాంటి సంబంధాలు లేవని, పొత్తులు కూడా పెట్టుకోమని ఆయన తేల్చి చెప్పారు. కేవలం జనసేనతోనే తాము రాజకీయ సంబంధాలు నెరుపుతున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుటుంబ పాలన, అవినీతి పాలన, కులపాలన అనే మూడు గ్రహణాలు పట్టి పీడిస్తున్నాయని, వాటిని అంతమొందించి, బంగారు ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తామని సునీల్ దేవ్ధర్ ప్రకటించారు.