భైంసా అల్లర్లతో రంజుగా రాజకీయం
అదిలాబాద్, జనవరి 17,
ట్టణాల ప్రగతిని మార్చే మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్. భైంసాలో జరిగిన అల్లర్ల ఘటనతో వేడెక్కిన ఎన్నికల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బ్యాలెట్ వార్ను శాంతియుతంగా నిర్వహించడానికి ఒకపక్క పోలీసులు సమాయత్తమవుతుంటే నాయకుల ప్రచారంతో ఉమ్మడి ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికలు, కాక పుట్టిస్తున్నాయ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. జిల్లాలో ఉన్న మొత్తం 11 మున్సిపాలీటీల్లో పట్టు కోసం పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో విజయం సాదించడానికి అధికార పార్టీ సహా, కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయ్. భైంసాలో అల్లర్ల తర్వాత మున్సిపల్ సమరాంగణం మరింత వేడెక్కగా ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలలో ఎన్నికల నిర్వహణ పోలీసులకు సవాల్గా మారింది. శాంతియుతంగా ఎన్నికల నిర్వహించడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ తరుపున కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అడుగడగునా బలగాలను ఏర్పాటు చేసి నేతల ప్రచారానికి బందోబస్తు కల్పిస్తున్నారు. సీఎఎ అనుకూల, ప్రతికూల వర్గాలు ప్రజల్లో విషం చిమ్మకుండా కూడా ప్రచార సరళిని పోలీసులు పరిశీలిస్తున్నారు .ఇప్పటికే భైంసాలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆదిలాబాద్, నిర్మల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, బైంసా మున్సిపాలీటీలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని మున్సిపల్ ఎన్నికలలో సరిహద్దు దళాలు ప్రాంతాలలో వినియోగిస్తుండటం విశేషం.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా శాంతియుత వాతావరణాన్ని పాడుచేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.