నిర్భయ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు
మండిపడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ జనవరి 17
: నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడకుండా కేజ్రీవాల్ సర్కార్ తాత్సారం చేస్తోందన్న విమర్శలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. ‘‘ఉరి శిక్షకు కావాల్సిన పనులన్నింటినీ తమ ప్రభుత్వం గంటల్లోనే పూర్తి చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఏ పనినీ తమ ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. ఢిల్లీ ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి పాత్రా లేదు. దోషులకు శిక్ష పడాల్సిందేనని గతంలో కూడా మేము పేర్కొన్నాం.’’ అని కేజ్రీవాల్ ప్రకటించారు. ఉరి అమలుపై నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం చేసిన విషయంపై ఆయన స్పందిస్తూ.. నిర్భయ తల్లిదండ్రులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని పనులను తమ ప్రభుత్వం చేసిందని, ఫైలును కూడా రాష్ట్రపతి భవన్కు పంపించామని తెలిపారు. అయినా ఉరి అమలుకు ఎందుకు ఆలస్యమవుతోందని సూటిగా ప్రశ్నించారు. ‘‘కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయంపై తమ ప్రభుత్వం ఎలాంటి జాప్యమూ చేయడం లేదు. మా ప్రమేయమే లేదు. ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైలును పంపిస్తున్నామంతే’’ అని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరగడానికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. న్యాయం జరగడంలో జరుగుతున్న జాప్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జవదేకర్ పేర్కొన్న విషయం తెలిసిందే.