ఎన్పీఆర్ పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ జనవరి 17
;: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఇస్రారుల్ హక్ మోండల్ నేతత్వంలోని 20 మంది పశ్చిమ బెంగాల్ వాసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నోటిఫికేషన్ 2019 జూలై 31న జారీ అయిన సంగతి తెలిసిందే. ఎన్పీఆర్ నవీకరణ కార్యక్రమం 2020 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. పౌరసత్వ నిబంధనలలోని 4వ నిబంధన ప్రకారం ఎన్పీఆర్ కోసం సేకరించిన సమాచారాన్ని జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్సీ) కోసం ఉపయోగించుకోవచ్చు.పౌరసత్వ సవరణ చట్టం అమలును కూడా పిటిషనర్లు సవాల్ చేశారు. మత ప్రాతిపదికపై పౌరసత్వాన్ని మంజూరు చేయడం రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని ఆరోపించింది.పౌరసత్వ సవణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 60 పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్పై విచారణ జరుగుతుంది.