పవన్ కల్యాణ్కు పార్టీని నడిపేంత శక్తి లేదు: మంత్రి శంకర్ నారాయణ
అనంతపురం జనవరి 17
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీని నడిపేంత శక్తి లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో రూ.6 కోట్లతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఏ పార్టీలోనైనా కలవడానికి సిద్ధంగా ఉందని, పవన్కు పార్టీ నడిపే శక్తి లేదని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీని రకరకాలుగా విమర్శించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు వారితోనే జతకట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ప్రశ్నించే పార్టీ’ అంటూ ప్రజల ముందుకొచ్చిన ఆ పార్టీ ఏమైందని అడిగారు. ‘బీజేపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్కు ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలూ ఒకటేనా. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని ఓడించేందుకు మీరంతా కలిసికట్టుగా పని చేశారు భవిష్యత్తులో టీడీపీ కూడా బీజేపీతో కలుస్తుందన్న అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి’ అని ఆయన అన్నారు. జగన్కు వస్తున్న ఆదరణ చూసి జనసేన పార్టీకి రాజకీయం చేసే శక్తి, ఆసక్తి పోయిందని, దీంతో రాజకీయాల నుంచి పారిపోదామనే ఉద్దేశ్యంతో బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి, దశాబ్దాల కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనే భయంతో జనసేన, బీజేపీ, టీడీపీ కొత్తఎత్తులు వేస్తున్నాయన్నారు. వీరి ఎత్తులను ప్రజానీకం గమనిస్తోందని పేర్కొన్నారు.