ఉత్తరప్రదేశ్లోని డివిజన్ల తరహాలో 4 జోన్లుగా ఆంధ్రప్రదేశ్
‘రాజధాని’ రద్దు కాబోతోంది! రాజధాని కేంద్రంగా జరగాల్సిన పరిపాలనను సంపూర్ణంగా వికేంద్రీకరించి.. ప్రజలకు రాజధానితో సంబంధమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్లోని డివిజన్ల తరహాలో నవ్యాంధ్రను కూడా నాలుగు జోన్లుగా విభజించాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి.. ప్రతి జోన్లో ప్రతి కీలక శాఖకు చెందిన జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నాయి. నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించేస్తే రాజధానిపై వారిలో సెంటిమెంటు ఉండదని భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నాయి సచివాలయంతో సంబంధమున్న విధానపరమైన నిర్ణయాలు కాకుండా.. ప్రజా వినతులు, సమస్యలు, ఉద్యోగుల కోర్కెలు తదితరాలన్నీ కమిషనరేట్లలోనే పరిష్కారమైపోతాయని తెలిపాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాలు ఉన్నాయి. పాలనాసౌలభ్యం కోసం వీటన్నిటినీ 18 డివిజన్లుగా విభజించి.. డివిజనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. ఇదే మోడల్పై సీఎం జగన్ దృష్టి సారించారు. జోనల్ వ్యవస్థపై సోమవారం ఉదయం జరిగే మంత్రివర్గ భేటీలో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన కార్యాచరణను వెల్లడిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజధాని నగరంతో ప్రజలకు సంబంధమే లేకుండా చేయడమే సీఎం ఉద్దేశమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. . ఈ మేరకు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని సమాచారం. దీనిప్రకారం.. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లు ఏర్పాటవుతాయని తెలిసింది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును తీసుకురాబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సోమవారం ఉదయం జరిగే కేబినెట్ సమావేశంలో.. సీఆర్డీఏ చట్టంలో మార్పులూ చేర్పులూ చేస్తూ.. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థకు అధికారాలు బదలాయిస్తూ బిల్లు తీసుకురానున్నట్లు ఓ మంత్రి తెలిపారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. 1.అమరావతిలో అసెంబ్లీ (వర్షాకాల, శీతాకాల సమావేశాలు మాత్రమే), హైకోర్టు బెంచ్. 2.విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 3. కర్నూలులో హైకోర్టు, న్యాయ పరిధిలోని సంస్థలన్నీ..