ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది
స్పీకర్ తమ్మినేని తో పాటు ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం
అమరావతి జనవరి 22
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రైతు భరోసాపై సభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ ఆందోళనలు చేయడంతో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై సీఎం జగన్ మండిపడ్డారు. 'ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది. స్పీకర్ను టీడీపీ అగౌరవపరుస్తోంది. సంస్కారం లేని టీడీపీ సభ్యులు సభకు ఎందుకు వస్తున్నారో తెలియదు. 10 మంది ఉన్నారు..రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వీధి రౌడీలను ఏరివేయకపోతే.. వ్యవస్థ మారదు. చేతనైతే సలహాలు ఇవ్వాలి. మా 151 మంది ఎమ్మెల్యేలు ఓపిగ్గా ఉంటే..10 మంది టీడీపీ సభ్యులు పోడియం మీదికి వస్తున్నారు. ప్రజా సమస్యలపై టీడీపీకి చర్చ ఇష్టం లేదు. సలహాలు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నారని' జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.