చార్మినార్ ర్యాలీకి అనుమతి కష్టమే
హైద్రాబాద్, జనవరి 23 :
సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ చార్మినార్ వద్ద తలపెట్టిన భారీ ర్యాలీకి అనుమతి నిరాకరించాలని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 25న ఒవైసీ ఈ నెల మొదట్లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు అనుమతి ఇవ్వకూడదని ఉమా మహేంద్ర అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.సీఏఏకు వ్యతిరేకంగా చార్మినార్ వద్ద ఎంఐఎం, ముస్లిం సంఘాలు ప్రణాళిక వేస్తున్న భారీ ర్యాలీకి అనుమతినిస్తే గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందని ఉమా మహేంద్ర తన పిటిషన్లో పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముందు రోజు అంటే జనవరి 25న భారీ ర్యాలీ నిర్వహించుకుంటే అల్లర్లు చెలరేగే అవకాశముందని వివరించారు. ఇటీవల భైంసాలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులను పిటిషనర్ ప్రస్తావించారు. రిపబ్లిక్ డే ముందు రోజు ఇలాంటి ఘటనలే మళ్లీ జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఒవైసీ పాల్గొనే సభలో ఉద్రిక్త ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. అటువంటి ప్రసంగాల వల్ల గొడవలు తలెత్తుతాయి. అందులోనూ చార్మినార్ పరిసర ప్రాంతం హిందూ, ముస్లింలు నివసించే ప్రాంతం కాబట్టి, సీఏఏ ర్యాలీకి అనుమతి ఇస్తే హింసాత్మ ఘటనలు చెలరేగే అవకాశం లేకపోలేదని వివరించారు. దీంతో అక్కడ నివసించే అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ ఉండదని పిటిషనర్ పేర్కొన్నారు. అందుచేత సీఏఏ ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉమా మహేంద్ర అనే వ్యక్తి పిటిషన్లో వివరించారు. అయితే, ఈ వ్యవహారంపై కోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందో వేచి చూడాలి.