మండలి రద్దుపై భయపడేది లేదు
అమరావతి జనవరి 24
మండలి రద్దు చేస్తామనడం మరో ఉన్మాద చర్య అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రద్దు తీర్మానం చేయకుండా అసెంబ్లీలో చర్చ జరపడం రాజ్యాంగ విరుద్దమన్నారు. శుక్రవారం అయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అంశం సెలెక్ట్ కమిటీ, హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. కౌన్సిల్ సభాపతిని అసెంబ్లీలో తప్పుపట్టడం ఎక్కడైనా జరిగిందా అని నిలదీశారు. మండలి రద్దుపై భయపడేది లేదని.. సీఎం బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. కౌన్సిల్ చైర్మన్ ప్రసంగానికి అసెంబ్లీలో వక్రభాష్యాలా అంటూ ధ్వజమెత్తారు. చట్టాలను తుంగలో తొక్కుతారా అంటూ మండిపడ్డ చంద్రబాబు మెజార్టీ ఉందని తలకు రోకలి చుట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు. సెలెక్ట్ కమిటీకి పంపాక ఆఫీసుల తరలింపు తగదన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపింది ప్రజాభిప్రాయం కోసమే అని ప్రజాభిప్రాయం తీసుకుంటామని అనడం కౌన్సిల్ నేరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. 1984 ఆగస్ట్ సంక్షోభం తనతో సహా అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలను హీరోలను చేసిందని, అప్పటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అందరికీ స్ఫూర్తి అని అన్నారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలుగా నిలబడ్డారన్నారు. కౌన్సిల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మరో స్ఫూర్తి అని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో టీడీపీ ఎమ్మెల్సీలు హీరోలయ్యారన్నారు. పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు చరిత్ర హీనులు అయ్యారని ఆయన మండిపడ్డారు. టీడీపీ చరిత్రాత్మక పోరాటంతో వైసీపీ దిమ్మ తిరిగిందని...అక్కసుతోనే టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగించారని చంద్రబాబు ఆరోపించారు.