పరిపాలనను వికేంద్రీకరించాలి
కర్నూలు జనవరి 24
రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించడం కాక పరిపాలన వ్యవస్థను కూడా వికేంద్రీకరించాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే భిన్నమైందని, మంచిదని చెప్పారు. అన్ని ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ముఖ్యమంత్రిపై ఉందన్నారు. వైజాగ్, రాయలసీమ ప్రాంతాల్లో మినీ సచివాలయాలు, హైకోర్టు బెంచ్, శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కోరారు. జమ్ము కశ్మీర్లో సైతం ఈ పాలనే అమలవుతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పాలనను వికేంద్రీకరిస్తే దీనికి అన్ని పార్టీలను ఒప్పించే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. కర్నూలులో మినీ సచివాలయం, శాసనసభ సమావేశాల భవనాలు, హైకోర్టు బెంచిల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలమిస్తే బిల్డర్లు అంతర్జాతీయ స్థాయిలో భవనాలు నిర్మించి ఇస్తారన్నారు. ఇందుకు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. అమరావతి సమస్య సెలక్షన్ కమిటీకి వెళ్లిందని, మళ్లీ కోర్టుకు వెళుతుందని.. మళ్లీ మళ్లీ ఏదైనా జరగవచ్చని పేర్కొన్నారు. దీనివల్ల సమయం వృథా కావడమేకాక కేంద్రం ఇచ్చే నిధులు సైతం నిలిచిపోయే అవకాశముందని పేర్కొన్నారు. దేశానికి అమరావతిని రెండో రాజధానిగా ఏర్పాటుచేస్తే అమరావతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.