YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఫిరాయింపు నేతలకు పదవులు

 ఫిరాయింపు నేతలకు పదవులు

 ఫిరాయింపు నేతలకు పదవులు
గుంటూరు, జనవరి 25
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నంను నియమించిన సీఎం.. గౌరవ చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ను నియమించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 2019లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏసురత్నం పోటీ చేయగా, ఆయనపై టీడీపీ తరఫున మద్దాలి గిరి గెలిచారు. అయితే వైసీపీ తరఫున ఓడిపోయిన అభ్యర్థి ఏసురత్నం చైర్మన్ హోదా పొందగా, గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి గౌరవ చైర్మన్‌గా నియమితులయ్యారు.ఇటీవలే మద్దాలి గిరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితుడినై ప్రభుత్వానికి మద్దతు ఇస్తునట్లు ఎమ్మెల్యే గిరి తెలిపారు. అయితే ఇది జరిగిన నెల రోజుల్లోనే టీడీపీ ఎమ్మెల్యే గిరికి కీలక పదవి లభించడం గమనార్హం.ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరితో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అలాగే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి అవసరమైన ప్రతి సందర్భంగా తన మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బయటి నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లయింది.రాజధాని అమరావతి వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. సీఎం జగన్ కూడా మూడు రాజధానుల వ్యవహారంలో అంతకంటే బలంగా ఉన్నా శాసనమండలి వ్యవహారంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును రాజకీయంగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించేలా మద్దాలి గిరి నియామకం జరిగిందని పలువురు విశ్లేషిస్తున్నారు.వాస్తవానికి మద్దాలి గిరి కంటే ముందే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో మొదట్లో ఓ మూలన వేరుగా కూర్చున్న వంశీ.. ప్రస్తుత సమావేశాల్లో మాత్రం వైసీపీ సభ్యుల పక్కనే కూర్చున్నారు. తద్వారా తాను వైసీపీ సభ్యుడినేననే సంకేతం పంపేశారు. మద్దాలి గిరికి పదవి లభించిన నేపథ్యంలో వంశీకి కూడా ఏదో ఒక పదవి లభించబోతుందా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.మద్దాలి గిరికి పదవి ఇవ్వడం ద్వారా టీడీపీ నుంచి వచ్చే నాయకులకూ సముచిత స్థానం లభిస్తుందనే భరోసా ఇచ్చేందుకే వైసీపీ అధిష్టానం ఈ రకంగా పావులు కదిపిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలైన వంశీ, గిరి మద్దతు ప్రకటించగా.. గుడివాడలో మంత్రి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ సైతం వైసీపీ గూటికి చేరారు. తద్వారా ప్రస్తుతానికి సీఎం జగన్‌కు రాజకీయంగా కీలమైన రాజధాని ప్రాంత కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే ప్రధానంగా దృష్టి సారించబోతున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నం, గౌరవ చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. వైస్ చైర్మన్‌గా శృంగవరపు శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులుగా మట్టికొయ్య రాణి స్వర్ణలత, కేసరి సుబ్బులు, అంగిరేకుల పూర్ణ వెంకట గోపి కృష్ణ, గంటా మరియమ్మ, కాకి భాగ్యలక్ష్మి, వడ్లమూడి రత్న ప్రవీణ్ యర్రంకృష్ణారెడ్డి, పరస లక్ష్మీకృష్ణారావు, పంది రామలక్ష్మి, షేక్ షబ్బీర్ అహ్మ, కంజుల జై శంకర్‌రెడ్డి, వేంపాటి.నాగిరెడ్డి నియమితులయ్యారు

Related Posts