అంచనాలను వమ్ము చేసిన అందోల్ ఓటర్లు
సంగారెడ్డి జనవరి 25
ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీలో ఓటర్లు ఊహించని రీతిలో తీర్పు ఇచ్చారు. ప్రధాన పార్టీల అభ్యర్దులను కాదని తమకు అనుకూలమైన అభ్యర్థులకే పట్టం కట్టారు. తెరాస కాంగ్రెస్ పార్టీలో స్థానిక దిగ్గజ నేతలకు ఓటర్లు మొండి చెయ్యి చూపించారు. బరిలో ఉన్న అభ్యర్థుల జాతకాలను తేల్చి పారేశారు. 20 వార్డు స్థానాలకు గాను 13 స్థానాలు, తెరాస, 6 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 12 వ వార్డు మాత్రం తెరాస అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థి స్వతంత్రంగా నిలబడి తన సత్తా చూపెట్టారు. మంత్రి హరీష్ రావు ఆశీస్సులతో బరిలో నిలిచిన పట్లూరి శివశేఖర్ ఓడిపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఆ వార్డులో 60 ఓట్ల అధిక్యంతో స్వతంత్ర అభ్యర్థికి అవకాశం కల్పించారు ఓటర్లు. చైర్మన్ రేసులో వున్న మాజీ ఎంపీపి రామ గౌడ్ కు ఓటమి తప్పలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ రేసులో ఉన్నవారికి ఓటర్లు అవకాశం కల్పించినా అధిక స్థానాలను తెరాస పార్టీ కైవసం చేసుకోవడంతో గెలిచిన అభ్యర్థులకు మాత్రం అసంతృప్తి తప్పలేదు.