పలితాలతో పుత్రోత్సాహం పట్టాభిషేకమే ఆలస్యం ...
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా పలు పార్టీలు పేర్కొంటుంటే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ మాత్రం తనకు రెఫరెండం అని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కొత్త పదవికట్టబెట్టనున్నారని అంటున్నారు. కీలకమైన మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగించడం వెనుక కేటీఆర్ సత్తాయే కారణమని ప్రచారం జరుగుతుండగా...ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ఇదే సరైన సమయమని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఎన్నికలపై ఇటీవలే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడంతో...సీఎం పీఠం త్వరలో యువనేతకు దక్కుతుందని అంటున్నారు. ప్రచారం చివరి రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి పురప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్శాఖమంత్రిగా మున్సిపల్ ఎన్నికలు తన పనితీరుకు నిదర్శనంగానే భావిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.