భైంసాలో ఎంఐఎం పాగా
అదిలాబాద్, జనవరి 25,
జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించింది. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. విజయం కోసం ఎంఐఎం, బీజేపీ తీవ్రంగా పోటీపడ్డాయి. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయాయి. గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంత చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునారావృత్తం చేసి పట్టునిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది