స్పీకర్ వ్యవహారం విడ్డూరం
రాజమండ్రి జనవరి 25
ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్యే, జెఎసి నాయకులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రస్తుతానికి బ్రేకులు పడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తామని సిఎం జగన్ చెబుతున్న మాటలు అంత సులువు కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిలో ఛైర్మన్ షరీఫ్ను చుట్టుముట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు పంచాంగం విప్పడం దారుణమన్నారు. ఈ చర్యను జెఎసిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాసనసభ, శాసనమండలి దేని హక్కులు దానికి ఉంటాయని అది కూడా తెలియకుండా జగన్ మండలి ఛైర్మన్ షరీఫ్ మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. వైసిపి ఎమ్మెల్యేల నోటికి అడ్డు, అదుపు లేకుండా పోయిందన్నారు. శాసనమండలి రద్దు చేసి రాజధాని బిల్లులను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభలో వైసిపికి మెజారిటీ ఉన్నంత మాత్రాన అన్ని జగన్ అనుకున్నట్టు జరగవన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ వ్యవహారశైలి చాలా విడ్డూరంగా ఉందన్నారు. హుందాతనం లేకుండా ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తున్న ఇటువంటి స్పీకర్ను ఇప్పటివరకు తాము చూడలేదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో రాజకీయ క్రీడ పేరుతో రాక్షస క్రీడ సాగిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలు, ధర్మాన పక్షాన నిలబడుతుందన్నారు.