కేంద్రం కోర్టులో మండలి బంతి
విజయవాడ, జనవరి 27
ఏపీ శాసన మండలి రద్దు కోసం కేబినెట్ తీర్మానం చేసిన వేళ.. ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత యమనల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలిని రద్దు చేయండి ప్రతిపాదించే అవకాశం మాత్రమే శాసనసభకు, కేబినెట్కు ఉంటుందని ఆయన తెలిపారు. మండలని రద్దు చేసే అధికారం వీళ్లకు లేదన్నారు. ఆ అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం, ఆమోదించకపోవడం కేంద్రం ఇష్టమని ఆయన తెలిపారు.అసెంబ్లీ చేసిన తీర్మానం న్యాయ శాఖ ద్వారా కేంద్ర కేబినెట్కు వెళ్తుందన్న యనమల.. కేబినెట్ ఆమోదం పొందాక.. ఆ తీర్మానం లోక్ సభకు, రాజ్య సభకు వెళ్తుందన్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే కౌన్సిల్ రద్దవుతుంది. అప్పటి వరకూ మండలిని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని తెలిపారు.ఇప్పటికే చాలా ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయన్న యనమల.. చరిత్రను చూస్తే మండలి రద్దుకు రెండేళ్ల సమయం పడుతుందని అర్థం అవుతుందన్నారు. రాష్ట్రపతి 14 రోజుల గడువుతో నోటీసు ఇచ్చిన తర్వాతే కౌన్సిల్ రద్దవుతుందన్నారు. అప్పటి వరకూ శాసన మండలి మనుగడలోనే ఉంటుందన్నారు.