నేరేడుచర్లలో హైడ్రామా, ఛైర్మన్ ఎన్నిక వాయిదా
నల్గొండ, జనవరి 27
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో హైడ్రామా నడిచింది. ఎక్స్అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావును లోనికి అనుమతించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ను విరగ్గొట్టి, చేతిలో ఉన్న పేపర్లను చించేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవీపీకి ఓటు హక్కు కల్పించడం పట్ల అభ్యంతరం తెలిపిన టీఆర్ఎస్ పార్టీ.. ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది.తీవ్ర గందరగోళం నేపథ్యంలో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. విభజన అనంతరం ఎంపీ కేవీపీని తెలంగాణకు కేటాయించారు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు వేయడానికి ఎంపీ కేశవరావుకు అనుమతి ఇవ్వగా.. హనుమంతరావుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.నేరేడుచర్లలో మొత్తం 15 వార్డులుంగా.. టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. అయితే, తెలంగాణకు కేటాయించిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచందర్రావును ఎక్స్అఫీషియో సభ్యుడిగా దరఖాస్తు పెట్టుకున్నా ఓటు హక్కు కల్పించలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్త చేసింది.3 ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్ఎస్కు 10 మంది బలం ఉండగా.. 2 ఎక్స్అఫీషియో ఓట్లు, సీపీఐ మద్దతుతో కలిపి కాంగ్రెస్ సంఖ్యా బలం 10కి చేరింది. ఇరు పార్టీల సంఖ్యా బలం సమానంగా మారడంతో నేరేడుచర్ల ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.