చౌటప్పుల్ లో ఉద్రిక్తత
నల్గొండ, జనవరి 27,
చౌటుప్పల్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ రణరంగంగా మారింది. కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్టుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన సీపీఎం.. ఫలితాల తర్వాత అనూహ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్ఎస్కు మద్దతు తెలపడానికి వచ్చిన సీపీఎం సభ్యులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఫలితాల అనంతరం హంగ్ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఛైర్మన్ ఎంపిక అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 20 వార్డులున్న చౌటుప్పల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3, ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది.మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్, సీపీఎం మధ్య అనధికార పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో సీపీఎం సభ్యులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ద్వంద్వ విధానాల సీపీఎం డౌన్ డౌన్’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సీపీఎం సభ్యులకు మద్దతుగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రమాణ పత్రాలను చించివేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు