గులాబీకి దక్కిన నిజామాబాద్
నిజామాబాద్, జనవరి 27
ఉత్కంఠ.. మేయర్ పీఠం ఆ పార్టీకే..!
నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ పదవి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మేయం పీఠం దక్కించుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థితో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన మరో కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. దీంతోపాటు ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుండగా.. అధికార టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం దక్కినట్లైంది.నిజామాబాద్లో మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా.. ఎంఐఎం 16 స్థానాల్లో విజయం సాధించింది. 28 కొర్పొరేటర్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే.. ఎంఐఎం, టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో వీరి బలం 29కి చేరింది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. ఇండిపెండెంట్ కార్పొరేటర్, కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన కార్పొరేటర్, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి 37 ఓట్లతో గులాబీ పార్టీ ముందు వరుసలో నిలిచింది.మేయర్ పదవి టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం కోసం ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా.. టీఆర్ఎస్ అధిష్టానం ఒకరి పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం.మేయర్ పదవి కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రానందున తాము వెనక్కి తగ్గుతున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం (జనవరి 27) ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 12.30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేయర్ పీఠం దక్కకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.