కొత్తగూడెం లో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని దాని కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రకటన చేయడం పట్ల కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు హర్షం వ్యక్తం చేశారు.కొత్తగూడెం జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.2014 లో తాను శాసనసభ్యునిగా గెలిచినప్పటి నుంచి దీని కోసం ప్రయత్నం చేస్తున్నట్లు జలగం వివరించారు.ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీష్ రావు ద్వారా లేఖ పంపారని,తాను స్వయంగా ఆ నాటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ని కలిశానని జలగం వివరించారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ “రైట్స్” ప్రాధమిక అధ్యయనం చేసి కొత్తగూడెం లో విమానాశ్రయం ఏర్పాటుకి అనుకూలత వుందని నివేదిక ఇచ్చిందని జలగం అన్నారు.తరవాత కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్,రక్షణ శాఖ నిరభ్యంతర పత్రం ఇచ్చిందని జలగం అన్నారు.సిఎం కేసిఆర్,మంత్రి కేటిఆర్ గార్ల ఆశీసులతో త్వరలోనే కొత్తగూడెం లో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటవుతుందని జలగం వెంకట రావు ఆశాభావం వ్యక్తం చేశారు.