ఎంపీ అరవింద్ కు ఆశాభంగం
నిజామాబాద్, జనవరి 28
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీకి ఆశాభంగమైంది. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు 6 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ మేయర్గా టీఆర్ఎస్ కార్పొరేటర్ నీతూ కిరణ్, డిప్యూటీ మేయర్గా టీఆర్ఎస్కు చెందిన మరో కార్పొరేటర్ ఎండీ ఇద్రీస్ ఖాన్ ఎన్నికయ్యారు.టీఆర్ఎస్ తరఫున మేయర్ పదవికి పోటీ చేసిన నీతూ కిరణ్కు 38 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి లావణ్యకు 29 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్గా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఇద్రీస్ ఖాన్కు 38 ఓట్లు రాగా.. బీజేపీ తరఫున పోటీలో నిలిచిన మల్లేశ్ యాదవ్ను 29 మంది బలపర్చారు. దీంతో మేయర్గా నీతూ కిరణ్, డిప్యూటీ మేయర్గా ఇద్రిస్ ఖాన్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.నిజామాబాద్లో మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా.. ఎంఐఎం 16 స్థానాల్లో విజయం సాధించింది. 28 కొర్పొరేటర్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే.. ఎంఐఎం, టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో వీరి బలం 29కి చేరింది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. ఇండిపెండెంట్ కార్పొరేటర్, కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన కార్పొరేటర్, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి 37 ఓట్లతో గులాబీ పార్టీ ముందు వరుసలో నిలిచింది.మరోవైపు.. ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోని అన్ని మున్సిపల్ సంఘాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. బోధన్ మున్సిపల్ ఛైర్పర్సన్గా తూము పద్మ, వైస్ ఛైర్మన్గా ఎమ్మెల్యే షకీల్ సోదరుడు ఏతేషామ్ ఎన్నికయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్గా పండిత్ వినీత, వైస్ ఛైర్మన్గా మున్నాభాయ్ ఎన్నికయ్యారు. భీంగల్ మున్సిపల్ ఛైర్పర్సన్గా మల్లెల రాజశ్రీ, వైస్ ఛైర్మన్గా భగత్ను ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా జాహ్నవి, వైస్ ఛైర్పర్సన్గా ఇందు ప్రియ; ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్గా సత్యనారాయణ, వైస్ ఛైర్పర్సన్గా సుజాత ఎన్నికయ్యారు. బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్గా జంగం గంగాధర్, వైస్ ఛైర్మన్గా షేక్ జుబేర్ను ఎన్నుకున్నారు.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అదవింద్ ప్రజలను రెచ్చగెట్టే ప్రయత్నం చేసినా.. ప్రజలు తమకే పట్టం కట్టారని వ్యాఖ్యానించారు.ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. మేయర్ పీఠం టీఆర్ఎస్ గెలిచినా రాజకీయంగా, నైతికంగా నిజామాబాద్ నగరంలో బీజేపీనే గెలిచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ సభ్యులను, కార్యకర్తలను ముట్టుకుంటే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్లేనని ఆయన హెచ్చరించారు.సార్వత్రిక ఎన్నికల తరహాలో నిజామాబాద్లో బీజేపీ హవా కొనసాగుతుందని భావించినా.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడటం చర్చనీయాంశంగా మారింది. అటు కరీంనగర్లోనూ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.