YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

బీహార్ లో కాంగ్రెస్ సీతాలయం...

బీహార్ లో కాంగ్రెస్ సీతాలయం...

బీహార్ లో కాంగ్రెస్ సీతాలయం...
పాట్నా, 
అయోధ్యలో రామాలయం. ఇది చాలా పాత కథ. మూడు దశాబ్దాల స్టోరీ. కొంతకాలం క్రితమే సుప్రీం కోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. అయోధ్యలో రామాలయం బీజేపీ స్టోరీ కాబట్టి దానిపై ఆ పార్టీకి పేటెంట్‌ హక్కులున్నాయి. కాపీరైట్‌ హక్కులున్నాయి. నాలుగు నెలల్లో అత్యద్భుత రామాలయం నిర్మిస్తామని కాషాయం పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా చాలామంది బీజేపీ నాయకులు చెప్పారు. రామభక్తులు, హిందూత్వవాదులు, ఆస్తికులు, సాధువులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు….ఇలా ఎందరెందరో రామాలయం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో బాబరీ మసీదు ఉన్న ప్లేసులో రామాలయం నిర్మించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందిగాని, బాబరీ మసీదు కూలగొట్టిన కేసు ఇంకా తేలాల్సివుంది. ఈ కేసులో నిందితుల్లో చనిపోయినవారు చనిపోగా మిగిలినవారికైనా శిక్ష పడుతుందో లేదో తీర్పు వస్తేగాని తెలియదు. ఇదిలావుంచితే, రామమందిర నిర్మాణంతో దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుందని, ఈ నిర్మాణం కారణంగా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి అంటే మూడోసారి పవర్‌లోకి వస్తుందని కాషాయ పార్టీ కమ్‌ మోదీ అభిమానులు కలలు కంటున్నారు. కొందరు బల్ల గుద్ది చెబుతున్నారు. ఈమధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ డౌన్‌ అయిపోతుండటంతో ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల మీద ఉంటుందేమోనని కొందరి డౌటు. అంటే ఎన్నికల నాటికి పార్టీ క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంటుందేమోనని కొందరు సందేహపడుతున్నారు. అందుకే రామాలయం త్వరగా నిర్మించి ఓ పనైపోయింది బాబూ అనిపించేస్తే మళ్లీ మోదీ ప్రధాని కావడం గ్యారంటీ అంటున్నారు. రాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి అక్కడ రామాలయం నిర్మించడం సబబే అనుకుందాం. మరి రామాలయం నిర్మిస్తే సరిపోతుందా? ఆయన భార్య సీతాదేవి మహాసాధ్వి కదా. మహా పతివ్రత కదా. జీవితాంతం పతియే ప్రత్యక్ష దైవమని కొలుచుకున్న ఆదర్శ మహిళ కదా. భారతీయత అంటే సీతారాములు అనే చెప్పుకుంటారు కదా. మరి అలాంటి సీతాదేవి గురించి బీజేపీ వారు ఎందుకు ఆలోచించలేదో…! దశాబ్దాలుగా రామాలయాన్ని పట్టుకొని వేలాడారు. అది వివాదాస్పద స్థలమైనా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌, ఇంకా ఏవో సంస్థలు వదల్లేదు. అయోధ్య వివాదం జరుగుతున్నప్పుడే ఆ గ్యాప్‌లో సీతాదేవికి ఆలయం నిర్మించవచ్చు కదా. ఆమె మిథిలా నగరంలో పుట్టింది. అందుకే ఆమెను మైథిలీ అన్నారు. మైథిలీ భాష కూడా ఉంది కదా. ఇప్పటి బిహార్‌ జిల్లాలోని మధుబని జిల్లాలో రామాయణ కాలంనాటి మిథిలా నగరం ఉండేదని అనుకుంటున్నారు. మరి అక్కడ కూడా సీతకు బ్రహ్మాండమైన గుడి కట్టొచ్చు కదా. భర్తకు గుడి కట్టకుండా భార్యకు కడితే బాగుండదని ఊరుకున్నారేమో. సరేలెండి..దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే…సీతకు కూడా ఆలయం కడుతున్నారోచ్‌…! అయితే ఈ గుడి కట్టేది బీజేపీవోళ్లు కాదండి. కాంగ్రెసోళ్లు. అదేంటి? వాళ్లది లౌకిక పార్టీ కదా అనుకుంటున్నారా? కట్టేది పార్టీ కాదులెండి. ప్రభుత్వమే కట్టాలని నిర్ణయించింది. కేంద్రంలో ఉన్నది బీజేపీ కదా అని అంటున్నారా? రాష్ట్రాల్లో కాంగ్రెసు ఉంది కదా. అవును…మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సారథ్యంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం సీతాదేవికి ఆలయం నిర్మించాలని నిర్ణయించింది. ఎక్కడ? సీత పుట్టిన ప్రాంతంలోనా? కాదండి. సీతాదేవి రావణాసురుడి చెరలో ఉన్న శ్రీలంకలో. ఆనాడు రావణుడి రాజ్యం ఇప్పటి శ్రీలంక అవునో కాదో తెలియదని కొందరు చరిత్రకారులు అంటున్నారు. అదే వేరే విషయం. ఇప్పటికీ ఇదేనని నమ్ముతున్నారు కాబట్టి అక్కడ కడతారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఆలయం నిర్మిస్తాయి. ఇదండీ సంగతి. రాముడిని చూడాలంటే అయోధ్యకు, ఆయన భార్యను దర్శించుకోవాలంటే శ్రీలంకకు వెళ్లాలి.

Related Posts