మా బలం ఏంటో చూపించాం : కేటీఆర్
హైద్రాబాద్, జనవరి 30
బీజేపీ రెండు మున్సిపాలిటీలు గెలిచి ఎగిరెగిరి పడుతోందని టీఆర్ఎస్ కార్య నిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 92 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టీఆర్ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బుతో గెలిచిందనడం సరికాదని, ఓట్లేసిన ప్రజలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే ఈవీఎంలే కారణమని లొల్లి చేశారని, మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఏం చెబుతారని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చోవడం మంచిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఛైర్ పర్సన్, మేయర్లు గురువారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొందని, ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అద్భుత దృశ్యం చూపిస్తోందని కేటీఆర్ అన్నారు. 2014లో 63 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయని అన్నారు. 2018లో చంద్రబాబు, రాహుల్ ఒక్కటైనా 75 శాతం సీట్లు టీఆర్ఎస్ సాధించిందని గుర్తు చేశారు. పంచాయతీ, జడ్పీ మండల ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు సాధించగానే ప్రతిపక్ష నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఓటు కారుకే అనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతోందని అన్నారు.‘‘మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అందుకే ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 8 వేల మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదే కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే లేరు. బీజేపీ ఎగిరెగిరి పడింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని మిడిసిపడింది. కానీ వారు పూర్తిస్థాయిలో అభ్యర్థులను దింపలేకపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవస్థల మీద నమ్మకం పోయిందంటున్నారు. ఉత్తమ్ రాజకీయాలను విరమించుకుని ఇంట్లో కూర్చుంటే మంచిది.’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.