పశ్చిమలో రాజు గారు వర్సెస్ చౌదరీ గారు..
ఏలూరు, జనవరి 31,
టీడీపీకి కంచుకోటవంటి పశ్చిమ గోదావరిలో వైసీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో పాగా వేసింది. టీడీపీ పుట్టిన నాటి నుంచి విజయమే తప్ప పరాజయం లేని నియోజకవర్గాల్లోకూడా వైసీపీ విజయం సాధించింది. ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాలతో సహా అనేక నియోజకవర్గాల్లో విజయం కైవసం చేసుకుంది. మరి ఇంతగా దూసుకుపోయిన పార్టీలో అప్పుడే విభేదాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు పరిశీలకులు. నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న విధంగా ఉన్నారని ప్రధాన వాదన వినిపిస్తోంది. ఈ జిల్లా నుంచి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, రంగనాథరాజు, తానేటి వనితలు మంత్రులుగా ఉన్నారు.అయితే, నేతల మధ్య సమన్వయం లేక పోవడంతో వైసీపీ పుంజుకునే పరిస్థితి లేకుండా పోయింది. నరసాపురం ఎంపీ ఎవరినీ పట్టించుకోకుండా తన మానాన తన పనిచేసుకుంటున్నారు. అదే సమయంలో అసలు పార్టీతోనే సంబంధం లేనట్టుగా బీజేపీ నేతలతో టచ్లో ఉంటున్నారు. దీంతో పార్టీ నేతలు ఈయనకు డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారట. అదేవిధంగా మంత్రి రంగనాథరాజు.. కూడా పార్టీలో అందరినీ కలుపు కొని పోకుండా నియోజకవర్గాల్లో వేలు పెడుతూ, ఎదుటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నా రట. ఈయనపై గత ఆరు మాసాల్లోనూ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.ఒక మంత్రి తనకు సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంటే మరో మంత్రి ఆళ్ల నాని మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఎవరి విషయాల జోలికీ పోకపోగా తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందో కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక, పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్తలకు ఏ మాత్రం టచ్లో లేకుండా ఉంటున్నారని సమాచారం. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా నాయకుల వ్యవహార శైలికి ఎవరికి వారే అన్నట్టుగా ఉందని అంటున్నారు. జిల్లాలో కీలకమైన ఓ నియోజకవర్గంలో మంత్రికి ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన నేతకు మధ్య పొసగడం లేదు.ఇక డెల్టాలో మరో మంత్రి ఆధిపత్య రాజకీయాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా ఏలూరులో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమావేశం మరింత రసాభాస సృష్టించింది. ఈ సమావేశానికి వచ్చిన ఎంపీలు రఘురామకృష్ణం రాజు తనకు అవమానం జరిగిందని సభా వేదికపై ఇలా కూర్చుని అలా లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ఎంపీ మార్గాని భరత్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ సైతం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలను వెల్లడించిందని చెబుతున్నారు. మంత్రులు, ఎంపీల పరిస్థితే ఇలా ఉంటే త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏవిధంగా మెరుగు పడుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరి నాయకుల మధ్య సఖ్యతపై జిల్లా పార్టీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఏమేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.