ఏపీలో మంత్రివర్గ విస్తరణ అడుగులు...
విజయవాడ, ఫిబ్రవరి 1,
ఏపీలో జగన్ ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు మారనుందా ? ముందుగా చెప్పుకొన్న సంకల్పం కొద్దిగా మార్పులకు లోను కానుందా ? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఈ విషయం వైసీపీ నాయకుల్లోనూ చర్చకు వచ్చింది. ప్రస్తుతం శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత తమ పరిస్థితి ఏంటంటూ చాలా మంది నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలావుంటే, ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది.ఈ నేపథ్యంలో మండలి రద్దుతో పదవులు ఆశించేవారిని సంతృప్తి పరిచేందుకు జగన్ తన మంత్రివర్గాన్ని మూడు విడతలుగా ఏడాదిన్నరకే పరిమితం చేయాలని పెద్దిరెడ్డి సహా బుగ్గనలతో చర్చించినట్టు తాజాగా వెలుగు చూసింది. అదేంటి మండలి రద్దుకు మంత్రి వర్గ విస్తరణకు సంబంధం ఏంటి ? అనే సందేహం తెరమీదకు కామన్గానే వస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్లు ఆశించారు. అయితే, అందరినీ తీసుకోవడం అనేక కారణాల నేపథ్యంలో కుదరలేదు. ఇక, సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం మరో నిర్ణయం.
ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా సహా అనేక మందికి ఒక పక్క ఎమ్మెల్యేగా ఉండగానే నామినేటెడ్ పదవులు ఇచ్చారు. దీంతో వారు సర్దుకున్నారు. అయితే, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామన్నవారు ఎదురు చూస్తుండగా ఇప్పుడు మండలి రద్దయింది. సో వీరికి ఎలా న్యాయం చేయాలి? అనే సమస్య తెరమీదికి వచ్చింది. దీంతో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలను వెనక్కి పిలిచి ఆయా పోస్టులను ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన నాయకులకు అప్పగిస్తారని వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోన్న టాక్.ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల నుంచి వెనక్కి వచ్చిన ఎమ్మెల్యేలకు త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపట్టి స్వల్పకాలానికి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారని సమాచారం. ఈ క్రమంలోనే ఏడాదిన్నరలోనే మంత్రి వర్గ విస్తరణ చేపడితే అందరిని సంతృప్తి పరిచినట్టు అవుతుందని వైసీపీ అదినాయకత్వం భావిస్తోంది. మరి జగన్ మండలి రద్దుతో ఏర్పడే రాజకీయ నిరుద్యోగాన్ని ఎలా భర్తీ చేస్తారో ? చూడాలి