పండుల, తోట ఇక దూరమేనా
కాకినాడ, ఫిబ్రవరి 1,
రాజకీయాలు ఎప్పుడూ సమాంతరంగా రైలు పట్టాల మాదిరిగా ఉండవనేది వాస్తవం. అనేక ఒడిదుడుకుల సమాహారమే నేటి రాజకీయాలు. అయితే, ఈ ఒడిదుడుకులు తట్టుకుని నిలదొక్కుకునే వారే రాజకీయంగా గుర్తింపు సాధిస్తున్నారు. లేని వారు తెరమరుగవుతున్నారు. ఇలాంటి వారిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు, టీడీపీ మాజీ నాయకుల గురించి ప్రస్తావిస్తున్నారు పరిశీలకులు. వారే కాకినాడ మాజీ ఎంపీ తోట నరసింహం ఫ్యామిలీ, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీం ద్రబాబు. ఈ ఇద్దరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయులు. అయితే, 2019 ఎన్నికలకు ముందు మాత్రం అప్పటి వరకు తమకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీని వదిలేశారు.2019 ఎన్నికల్లో తమకు టికెట్టు దక్కవని భావించి టీడీపీకి దూరమయ్యారు. ముఖ్యంగా తోట నరసింహం అనారోగ్యం కారణం గా తన సతీమణి వాణిని రాజకీయంగా రంగంలోకి దింపారు. వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం లేదా పిఠాపురం టికెట్ను ఆశించారు. అయితే పెద్దాపురంలో అప్పటికే అప్పటి హోం మంత్రి చిన రాజప్ప ఉండడం, ఆయనకు తప్ప టికెట్ ఎవరికీ ఇచ్చేది లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టడంతో నరసింహం బయటకు వచ్చి జగన్కు మద్దతిచ్చారు. చంద్రబాబు పిఠాపురంలోనూ అప్పటి ఎమ్మెల్యే వర్మను తప్పించనని చెప్పేశారు.వైసీపీలోకి వెళ్లాక జగన్ తోట వాణికి పెద్దాపురం టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ హోరెత్తినా పెద్దాపురంలో మాత్రం వాణి పుంజుకోలేక పోయారు. దీంతో ఇక్కడ మళ్లీ చినరాజప్పే గెలిచారు. అయితే, ఆ వెంటనే తమకు నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందని వాణి దంపతులు ఆశించారు. అయితే, ఆ తరహా సూచనలేవీ వైసీపీ నుంచి రాకపోయే సరికి వెంటనే బీజేపీలోకి జంప్ చేసేందుకు ప్రయత్నించిన ట్టు వార్తలు వచ్చాయి. దీంతో వైసీపీ అదినేత జగన్ ఈ ఫ్యామిలీని దూరం పెట్టారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.ఇక, పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరడమైతే చేరారు కానీ బాబు అనుకూల మీడియా విసిరిన గేలంలో చిక్కుకుని మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ఆ వెంటనే ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. అన్నా వచ్చేస్తా! అంటూ ఆయనను ఉటంకిస్తూ బాబు అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఆయనపై ఉన్న విశ్వాసం ఆయనే పొగొట్టుకున్నట్టు అయింది. దీంతో జగన్ ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఇక, టీడీపీ నుంచి బయటకు రావడంతో ఆ పార్టీ కూడా పట్టించుకోలేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడుల్లా ఈ ఇద్దరు నాయకులు మిగిలారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.