జగన్ తాతకు అడ్డొచ్చిన వాళ్లని పైకి పంపడం తెలిస్తే..
జగన్ మాత్రం అందర్నీ ఒకేసారి పైకి పంపాలని చూస్తున్నారు
జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి ఫిబ్రవరి 1
;: సీఎం జగన్పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తాత రాజారెడ్డికి తనకు అడ్డొచ్చిన వాళ్లని పైకి పంపడం తెలుసునని, జగన్ మాత్రం అందర్నీ ఒకేసారి పైకి పంపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం పీఠం కోసం ఎదురు చూసి ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఫైర్ అయ్యారు. ‘నీకు సాష్టాంగపడి నమస్కరించి చెబుతున్నా.. తీరు మార్చుకో’ అంటూ సీఎం జగన్ను జేసీ కోరారు. రాజధాని గ్రామాలలో దీక్ష చేస్తున్న రైతులు, మహిళలకు జేసీ దివాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నాడని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత ప్రజలకు జరిగిన నష్టంతో పోలిస్తే తనకు జరిగిన నష్టం చాలా చిన్నదని అన్నారు. తనకు 124 బస్సులు ఉంటే 84 బస్సులు మూసివేశాడని అన్నారు. కమ్మవాళ్ల డామినేషన్ ఉండటమే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపం అని వ్యాఖ్యానించారు. జగన్కు బాగా కుల పిచ్చి పట్టుకుందని, అందుకే ఇలా చేస్తున్నాడని అన్నారు. కుల పిచ్చితో జగన్ చరిత్ర హీనుడిగా తయారవుతున్నాడని అన్నారు. ‘మా వాడికి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రభువును వేడుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ‘చంద్రబాబు, నాపై కోపం ఉంటే.. మా మీద కక్ష తీర్చుకో.. కానీ ప్రజలను ఆగం చేయవద్దు’ అని సీఎం జగన్ను కోరారు. చంద్రబాబు ఓడిపోవడంతో రాష్ట్రం, రాజధానికి తీరని నష్టం జరిగిందని అన్నారు.