ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి
తనకు ఓటు వేయలేదని చిన్న చూపు చూడకూడదు: మంత్రి ఈటల
కరీంనగర్ ఫిబ్రవరి 1
: ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి తప్ప తనకు ఓటు వేయలేదని చూడకూడదని జమ్మికుంట మున్సిపాలిటీ నూతన కార్యవర్గానికి మంత్రి ఈటల రాజేందర్ హితవుచెప్పారు. పక్షపాతం లేకుండా ప్రజలందరి సమస్యలు పరిస్కరించాలని సూచించారు. మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా తక్కలపల్లి రాజేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ప్రసంగించిన మంత్రి ఈటల.. తొలుత హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. గెలవడం అనేది ఒక అదృష్టం అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచామని పేర్కొన్నారు. అయితే గెలిచిన అభ్యర్థులు కొందరే ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటారని, ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పుకొచ్చారు. పాత పాలక వర్గానికి హుజూరాబాద్, జమ్మికుంట రెండు పట్టణాలను అద్దంలా తీర్చిదిద్దడానికి ఎంతో డబ్బులు వెచ్చించామని, ఆ విధంగానే అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. జమ్మికుంట ప్రజలకు త్రాగునీరు ఇచ్చిన ఘటన టీఆర్ఎస్దే అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హుజూరాబాద్కు రూ.50, జమ్మికుంటకు రూ.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తన మంత్రి పదవి ముగుస్తుందనగా హుజూరాబాద్కు రూ.40 కోట్లు, జమ్మికుంటకు రూ.40 కోట్లు ఇచ్చానని తెలిపారు. ఆ డబ్బులు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. సపాయి కార్మికుల కోసం హుజూరాబాద్, జమ్మికుంట రెండు మున్సిపాలిటీల్లో డబ్బులు తెచ్చి డిపాజిట్ చేయించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ప్రజలకు వచ్చిన సమస్యను పరిష్కరించే విధంగా పాలక వర్గం ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేశారు. ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి తప్ప.. నాకు ఓటు వేయలేదు అని చూడకుండ ప్రజలందరి సమస్యలు పరిష్కరించాలన్నారు. పందుల సమస్య, రోడ్ల సమస్య, త్రాగునీరు సమస్యలు అన్ని తీర్చే బాధ్యత మున్సిపల్ పాలకవర్గానిదేనని స్పష్టం చేశారు. పేద కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందిచేలా జమ్మికుంట పట్టణంలో త్వరలో విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈటల తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో విద్య, వైద్యం కొరత లేకుండా చూస్తామన్నారు. ఏదైనా సరే తీసుకువచ్చే బాధ్యత తనదని, దానిని ప్రజలకు చేరవేసే బాధ్యత పాలక వర్గానిదని మంత్రి పేర్కొన్నారు. హుజురాబాద్, జమ్మికుంట రెండు నగరాలను హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా అభివృద్ధి చేసే బాధ్యత తనది అన్నారు. గ్రూపు రాజకీయాలు, వ్యత్యాసాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఇరు మున్సిపాలిటీల పాలకవర్గాన్ని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.