భూసేకరణకు దూరంగా విశాఖ రైతులు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 4,
విశాఖపట్టణంలో నివేశన స్థలాలు ఇచ్చేందుకు వీలుగా విశాఖలో చేపట్టిన భూసమీకరణకు అక్కడి రైతులు సహకరించడం లేదు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములను ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఎలాగైనా నిర్ణీత సమయంలో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న పట్టుదలతో జిల్లా అధికార యంత్రాంగం ఉంది. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి విశాఖ జిల్లాలో 2700 ఎకరాలు అవసరం అని అధికారులు అంచనా వేశారు. అయితే అవసరం కన్నా ఎక్కువ మొత్తంలో 6116 ఎకరాలను భూ సమీకకరణ విధానం ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ జిల్లాలోని 10 మండలాల పరిధిలో 55 గ్రామాల్లో భూమిని భూ సమీకరణ విధానంలో సమీకరించనున్నారు. ఇప్పటికే భూ సమీకరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో వివిధ గ్రామాల్లో సభలను బుధవారం నుంచి ప్రారంభించారు. తొలి రోజు గాజువాక, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, పద్మనాభం మండలాల్లో కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అయితే ఈ సభల్లో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం గమనార్హం. చాలా ఏళ్లుగా తాము ఈ భూముల్లో సాగు చేస్తున్నామని, ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న పంట చేతికి వచ్చే వరకూ ఆగాలని కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూములకు సంబంధించిన పత్రాలు చూపించాలని అధికారులు స్పష్టం చేయడంతో కొంతమంది తమ అభ్యంతరాలను తెలిపారు. రైతులు అంగీకరించకున్నా, నెల రోజుల వ్యవధిలో భూ సమీకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించారు. అసైన్డ్ భూమిని సాగు చేస్తున్న సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని కొంత స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు అంగీకరించపోయినా, ముందుకు వెళ్లాలని అధికార యంత్రాంగం భావిస్తోంది