YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కలెక్టర్ల భేటీకి  భారీ ప్రణాళికలు

 కలెక్టర్ల భేటీకి  భారీ ప్రణాళికలు

 కలెక్టర్ల భేటీకి  భారీ ప్రణాళికలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 4,
ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ల సదస్సుకు అధికారులు ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏ‌ఎస్‌ల బదిలీ చేపట్టిన కేసీఆర్ సర్కార్.. ఆ వెంటనే కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.కలెక్టర్ల సదస్సులో కొత్త మున్సిపల్ చట్టంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం పల్లె ప్రగతి తరహాలో పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.మరోవైపు.. రాష్ట్రంలో 60 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 21 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడం గమనార్హం. ఆరుగురికి పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్లు సహా వివిధ శాఖల్లో ఏళ్లుగా పని చేస్తున్న వారందర్నీ ప్రభుత్వ ట్రాన్స్‌ఫర్ చేసింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. పాలనను ప్రక్షాళన చేసే ఉద్దేశంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలేవీ లేనందున ఇకపై పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సారించడానికి భారీ సంఖ్యలో ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగించినట్లు భావిస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌కు నీటిపారుదల శాఖను అప్పగించారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హాను అంతగా ప్రాధాన్యం లేని పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖకు బదిలీ చేశారు. చిత్రా రామచంద్రన్‌కు కీలకమైన విద్యాశాఖ అప్పగించారు. విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్‌ రెడ్డిని వ్యవసాయ శాఖ కార్యదర్శిగా నియమించారు. గత మూడేళ్లుగా ఈ పదవిలో ఉన్న పార్థసారథిని ఈపీటీఆర్ఐ బాధ్యతలు అప్పగించారు.పలు జిల్లాల కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌లకు ప్రాధాన్యం దక్కింది. సీఎం కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించగా.. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా నియమించింది. గ్రేటర్‌లోని హైదరాబాద్‌ పరిధిలో.. హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు.

Related Posts