YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - 

 అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - 

 అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - 
తిరుపతి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌
తిరుపతి ఫిబ్రవరి 04
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో మంగళవారం ఉద‌యం అధికారులతో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ నెల 14వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై 22వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌంట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రచార రథాల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు.  బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని, వాహనసేవలలో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలు అకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ట్రెజరీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 18వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్‌.వి. సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్‌ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్‌ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. 
శ్రీవారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్లు ఆవిష్కరణ -  
అంతకుముందు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను, బుక్‌లెట్ల‌ను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మంగ‌ళ‌వారం ఉద‌యం ఆలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి 14 నుంచి 22వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు. 

Related Posts