నాలుగు నదుల అనుసంధానానికి ప్రణాళిక
హైద్రాబాద్, ఫిబ్రవరి 5,
గోదావరి– కావేరి నదుల లింక్ స్కీం తెరపైకి వచ్చింది. గోదావరి, కృష్ణా,- పెన్నా, కావేరి లింక్ ప్రపోజల్కు డ్రాఫ్ట్ డీపీఆర్ రెడీ అయిందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. నదుల లింక్ కోసం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) ఇప్పటికే డ్రాఫ్ట్ డీపీఆర్ను సిద్ధం చేసిందని పేర్కొన్నారు. తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గోదావరి నీటిని మళ్లించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా నిరుడు ఆగస్టులో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని మంత్రి చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తలపెట్టిన గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని కోరారని వెల్లడించారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ రూపొందించే బాధ్యతను ఎన్డబ్ల్యూడీఏకు అప్పగించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ సంస్థ రూపొందించిన డ్రాఫ్ట్ డీపీఆర్పై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు కోరామన్నారు.మూడు లింక్లుగా నదుల అనుసంధానం చేపట్టనున్నట్టు వివరించారు. తెలంగాణలోని ఇచ్చంపల్లి లేదా జానంపేట నుంచి గోదావరి నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్కు తరలిస్తామని, అక్కడి నుంచి పెన్నా బేసిన్లోని సోమశిల డ్యాంకు, అక్కడి నుంచి కావేరి బేసిన్లోని గ్రాండ్ ఆనికట్కు లింక్ చేస్తామని తెలిపారు. దీంతో ఏటా ఫ్లడ్ సీజన్లో గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలోకి పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గోదావరి, కృష్ణా నదుల లింక్ ప్రాజెక్టుతో ఏపీలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 3.45 లక్షల ఎకరాల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూమికి తాగునీటి సౌకర్యం కలుగుతుందన్నారు. నాగార్జునసాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్ ఆయకట్టును స్టెబిలైజ్ చేసుకోవచ్చన్నారు. నదుల లింక్ ప్రాజెక్టుపై ఆయా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఫైనల్ డీపీఆర్ సిద్ధం చేసి, చట్ట పరంగా అన్ని అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని తెలిపారు.గోదావరి నుంచి కృష్ణా, పెన్నా నదుల మీదుగా కావేరికి తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న 247 టీఎంసీల నీళ్లు చత్తీస్గఢ్ రాష్ట్ర వాటా అని తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు. ఆ నీటిని తరలించేందుకు ముందు చత్తీస్గఢ్ అంగీకరించాల్సి ఉంటుందని చెప్తున్నారు. గోదావరి, కావేరి లింక్పై ఎన్డబ్ల్యూడీఏ గతంలోని చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలు కోరిందన్నారు. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు ఇంతవరకు చెప్పలేదని పేర్కొన్నారు. నిరుడు ఆగస్టులో ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లోనే డ్రాఫ్ట్ డీపీఆర్లోని అంశాలను ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు గోదావరి, కృష్ణా నదుల లింక్ ప్రపోజల్స్పై చర్చిస్తున్నారని, అది కొలిక్కి వచ్చాక తమ అభిప్రాయం చెప్తామని ఆ మీటింగ్లో తెలంగాణ ఇంజినీర్లు స్పష్టం చేశారు. ఏపీ సైతం ఇలాంటి ఆన్సరే చెప్పింది.గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి లింక్ ప్రాజెక్టును చేపట్టాలంటే ప్రాజెక్టుతో లబ్ధి పొందే రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల మధ్య ఎంవోయూ తప్పనిసరి అని ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నారు. అన్ని రాష్ట్రాల ఒపీనియన్ తీసుకున్నాక ఆయా రాష్ట్రాల మధ్య కన్సల్టేషన్ మీటింగ్ నిర్వహించాలని, తర్వాత రివర్ లింకింగ్పై ఎంవోయూ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు, టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారు. నేషనల్ ప్రాజెక్టుగా రివర్ లింకింగ్ చేపట్టినప్పుడు రాష్ట్రాల డిమాండ్ పూర్తి చేసిన తర్వాతే దిగువ రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ ఒకే అయితేనే నేషనల్ ప్రాజెక్టు ముందుకు సాగుతుందని వారు చెప్తున్నారు.