నత్తకే నడకలు (అనంతపురం)
అనంతపురం, ఫిబ్రవరి 06 : అనంత నగరం నుంచి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలను కలిపేలా జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు జాతీయ రహదారుల పనులు చేపట్టగా.. అందులో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో నాలుగు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఐదు రహదారులకు సంబంధించి 2018 ఏప్రిల్లో టెండర్లు ఖరారయ్యాయి. జులైలో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2020 జనవరి 20లోగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే అనంతపురం-కళ్యాణదుర్గం రహదారి మాత్రమే పూర్తయింది. మిగిలినవన్నీ ఎక్కడికక్కడే నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు నాలుగేళ్ల కిందట చేపట్టిన గుత్తి - గుంతకల్లు - డొనేకల్లు రహదారి పనులు 40 శాతమే పూర్తి చేశారు. జిల్లా కేంద్రం నుంచి కళ్యాణదుర్గం, గుంతకల్లు, బత్తలపల్లి, కదిరి, కళ్యాణదుర్గం నుంచి ముల్కల్మూరు రహదారులన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. బొమ్మనహాళ్, రాయదుర్గం చేరుకోవాలంటే కళ్యాణదుర్గం మీదుగా వెళ్లాల్సిందే. గుంతకల్లు రైల్వే డివిజన్ కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హిందూపురం, మడకశిర ప్రాంతాలకు బెంగళూరు దగ్గరగా ఉంది. ఆ ప్రాంతాల వారంతా ఏ పనులున్నా బెంగళూరుకే వెళ్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆయా రహదారులను విస్తరిస్తున్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల పనులు వేగంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేపట్టిన తర్వాత పాత రోడ్లను తవ్వేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారులన్నీ గతంలో చాలా చిన్నవిగా ఉండేవి. వాహనాలు ఎదురెదురుగానే ఢీకొన్న సంఘటనలూ ఉన్నాయి. గమ్యాన్ని చేరుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఈ రహదారుల నిర్మాణాలు పూర్తయితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవచ్ఛు జాతీయ రహదారులుగా మార్చడంతో ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. అయితే ఈ పనులన్నీ నత్తతో పోటీ పడుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
గుత్తి - గుంతకల్లు - డొనేకల్లు మధ్య 66 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్హెచ్-67) నిర్మిస్తున్నారు. ఈ పనులు 2016లో ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లయినా 40 శాతం పనులే జరిగాయి. బళ్లారి, గుత్తి నుంచి వచ్చే వాహనాలతో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. ఈ పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. కాంట్రాక్టర్ కు ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించారు. అనంతపురం - కళ్యాణదుర్గం మధ్య రహదారి పనులు (ఎన్హెచ్-544డీడీ) దాదాపు పూర్తయ్యాయి. ఈ రహదారిపై వడ్డిపల్లి దగ్గర టోల్ప్లాజా నిర్మించాల్సి ఉంది. దానికి కావాల్సిన భూమిని ఆ శాఖ అధికారులు ఇప్పటివరకూ కాంట్రాక్టర్ కు అప్పగించలేదు. అసలు భూసేకరణే జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రహదారిపై రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు.