YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పకడ్బందీగా తెలంగాణ రెవెన్యూ చట్టం

పకడ్బందీగా తెలంగాణ రెవెన్యూ చట్టం

పకడ్బందీగా తెలంగాణ రెవెన్యూ చట్టం
హైద్రాబాద్, ఫిబ్రవరి 7,
తెలంగాణలో భూముల డ‌బుల్ రిజిస్ట్రేష‌న్లకు ఇక‌ బ్రేకులు ప‌డ‌నున్నాయా? ల‌్యాండ్ మ‌్యుటేష‌న్ పేరుతో డ‌బ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారుల‌కు ఇక చుక్కలు క‌నిపించ‌నున్నాయా? భూముల కొనుగోళ్లు, అమ్మకాల‌పై ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానంతో రెవెన్యూ శాఖ‌లో అవినీతికి చెక్ పెడ‌తామంటోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళ‌న‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెవ‌న్యూ శాఖ‌లో ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించడమే ల‌క్ష్యంగా సర్కార్‌ అడుగులు వేస్తుంది. భూ లావాదేవీల‌లో అధికారులు, రియ‌ల్ వ్యాపారులు క‌లిసి చేసే అవినీతికి చెక్ పెట్టేందుకు ప‌క‌డ్బందీగా ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం.ల్యాండ్ మ్యుటేష‌న్‌పై ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోంది. త‌మ పేరుపై రిజ‌స్ట్రర్ అయి ఉన్న భూముల‌ను రెవ‌న్యూ రికార్డుల‌లో న‌మోదు చేసే ప్రక్రియే మ్యుటేష‌న్. ఈ మ్యుటేష‌న్లను అడ్డుపెట్టుకున్న కొంద‌రు రెవెన్యూ అధికారులు.. అవినీతికి తెర‌లేపుతున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. మ్యుటేష‌న్ల కోసం లంచం తీసుకుంటూ.. ఎక్కడో చోట ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. దీంతో ప‌క‌డ్బందీగా కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా మొద‌ట తహసీల్దార్, వీఆర్వో అధికారాలకు క‌త్తెర పెట్టనున్నారు. మ్యుటేష‌న్ విష‌యంలో ఉండే విచ‌క్షణ అధికారాన్ని కొత్త చ‌ట్టంలో క‌ట్ చేయ‌బోతుంది స‌ర్కార్.భూ లావాదేవీల‌ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు. దీని ద్వారా తహసీల్దార్, వీఆర్వోలకు సంబంధం లేకుండా ల్యాండ్ మ్యుటేష‌న్ ఆన్ లైన్ ద్వారా జరిగిపోతుంది. ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భూముల క్రయవిక్రయాల‌ స‌మాచారం.. ఎప్పటిక‌ప్పుడు ల్యాండ్ డేటా బ్యాంక్‌ల‌కు అందుతుంది. అంటే రిజిస్ట్రేష‌న్ చేసుకున్న త‌ర్వాత ఆ స‌మాచారం వెంట‌నే డేటా బ్యాంక్‌కు వెళ్లిపోతుందన్నమాట. దీంతో త‌మ‌కు అందిన డాక్యుమెంట్‌ను స‌రిచూసుకుని రెవెన్యూ అధికారులు.. నిర్ణీత వ్యవ‌ధిలో మ్యుటేష‌న్ చేసేలా చ‌ట్టంలో ఉండ‌బోతోంది.ఇలా భూముల‌ను రిజ‌స్ట్రేషన్ చేయగానే.. అ స‌మాచారాన్ని రెవెన్యూ శాఖ‌తో పాటు, బ్యాంక్‌ లకు కూడా ఆ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా చేరిపోతుంది. దీంతో డ‌బుల్ రిజిస్ట్రేష‌న్‌ ల‌కు బ్రేకులు ప‌డ‌తాయి. అంతేకాదు, ఒకే భూమిని వివిధ బ్యాంక్‌ ల‌లో తాక‌ట్టు పెట్టి రుణాలు తీసుకోవ‌డం కూడా ఇక నుండి సాధ్యం కాదు. మొత్తానికి రెవెన్యూ శాఖ‌లో పేరుకుపోయిన అవినీతిని కూక‌టి వేళ్లతో తొలగించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న సీఎం కేసీఆర్.. దానికి అనుగుణంగానే సాంకేతిక‌ను జోడించి, ప‌క్కాగా క‌ళ్ళెం వేయ‌బోతున్నారు. 

Related Posts