కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈశాన్య శరణార్థులు: ప్రధాని మోదీ
హైదరాబాద్ ఫిబ్రవరి 7
ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలోని కోక్రజార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బోడోలతో ఇటీవల శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. అక్కడ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హింస వల్ల శరణార్థులగా మారిన వేలాది మంది ఈశాన్య రాష్ట్ర ప్రజలు.. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సంపూర్ణ గౌరవం, హుందాతనంతో వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రధాని అన్నారు. బోడో ల్యాండ్ ఉద్యమంలో పాల్గొని, ప్రజాజీవితంలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నట్లు మోదీ చెప్పారు. దాదాపు అయిదు దశాబ్ధాల తర్వాత, బోడో ఉద్యమంతో సంబంధం ఉన్న వారికి గౌరవం దక్కిందన్నారు. గత పాలకులు ఈశాన్యాన్ని విస్మరించారని, కానీ తాము బోడో ఒప్పందాన్ని నిజం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన మరోసారి గుర్తు చేశారు. కర్రలతో మోదీని కొట్టేందుకు జనం సిద్ధంగా ఉందని రాహుల్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ దెబ్బలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, పెద్దఎత్తున్న మహిళల అండ తనకు ఉందని మోదీ అన్నారు.