మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు: రాహుల్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 7
. : లోక్సభలో ఇవాళ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న రగడపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాపాడేందుకు బీజేపీ నేతలు కావాలనే లోక్సభలో రగడ సృష్టించారని ఆయన ఆరోపించారు. తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘వయనాడ్లో మెడికల్ కాలేజీ లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నేను ఇవాళ లోక్సభలో లేవనెత్తేందుకు ప్రయత్నించాను. నేను మాట్లాడడం బీజేపీ నేతలకు కచ్చితంగా ఇష్టం ఉండదు. అందుకే మేము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. మాణిక్కం ఠాగూర్ ఎవరి మీదా దాడి చేయలేదు. పైగా ఆయనపైనే దాడి జరిగింది. కావాలంటే లోక్సభ విజువల్స్ చూడండి...’అని రాహుల్ పేర్కొన్నారు.కాగా లోక్సభలో రాహుల్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పందిస్తూ... ఇటీవల ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడంతో రగడ మొదలైంది. తాను సమాధానం చెప్పే ముందు రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాననీ.. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని హర్షవర్థన్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలంటూ ఓ వైపు స్పీకర్ ఓం బిర్లా కేంద్రమంత్రికి సూచిస్తుండగానే కాంగ్రెస్ నేతలు తమ స్థానాల్లో నుంచి లేచివచ్చారు. హర్షవర్థన్ వద్దకు వెళ్లి తీవ్ర నిరసన తెలిపారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీలు కూడా సిద్ధం కావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా లోక్సభలో ఇవాళ చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చాంబర్లో బీజేపీ నేతలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి హర్షవర్థన్ కూడా ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం అయ్యారు.