స్వరూపనందకు అమరావతి సెగ
విజయవాడ, ఫిబ్రవరి 7
విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీకి అమరావతి నిరసన సెగ తగిలింది. గుంటూరు శివారు గోరంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలకు శుక్రవారం స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తెలుగు దేశం మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారని ఆయనకు వివరించారు.యాగాలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా యాగం చేయాలని మహిళలు కోరారు. అయితే వారి మాటలకు సమాధానం చెప్పకుండానే స్వరూపానందేంద్ర అక్కడి నుంచి ముందుకెళ్లారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పట్లో అమరావతి కోసం స్వామీజీ పూజలు చేశారని, ఇప్పుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడ్డారు. ఈ విషయమై అడిగేందుకు వస్తే పోలీసులు నెట్టివేశారని, స్వరూపానంద కూడా తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.