YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 ఎడారిలా మారిన వుహాన్

 ఎడారిలా మారిన వుహాన్

 ఎడారిలా మారిన వుహాన్
బీజింగ్, ఫిబ్రవరి 7
కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తోంది. ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ మహమ్మారి ఇప్పటి వరకూ 563 మందిని పొట్టనబెట్టుకోగా, బాధితుల సంఖ్య 30వేలకుపైగా చేరింది. గతేడాది డిసెంబర్‌ ఆఖరున వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వైరస్ ప్రస్తుతం 25కు పైగా దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించగా, దేశాలన్నీ వణుకుతున్నాయి. గురువారం ఒక్కరోజే హుబే ప్రావిన్స్‌లో సుమారు 70 మంది మృతి చెందగా.. కొత్తగా 3,156 కేసులు నమోదైనట్టు చైనా వెల్లడించింది.ఈ వైరస్‌ పురుడుపోసుకున్న వుహాన్‌ నగరంలో ప్రజల పరిస్థితి అత్యంత దయానీయంగా మారిపోయింది. వారంత జీవచ్ఛవల్లా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీనిపై వుహాన్‌లోని హాంకాంగ్‌ ఆర్థిక, వాణిజ్య కార్యాలయ డైరెక్టర్‌ విన్సెంట్‌ ఫంగ్‌ తన ఫేస్‌బుక్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘వుహాన్‌ వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయి ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. నిత్యావసరాల విషయంలో మాత్రం పెద్దగా సమస్య ఏర్పడలేదు.. సూపర్‌మార్కెట్లు, మందుల దుకాణాలు తెరిచే ఉన్నాయి. వస్తువుల సరఫరా సక్రమంగానే జరుగుతోంది.. కానీ ధరలు కాస్త ఎక్కువ. అధిక శాతం మంది ప్రజలు ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు.. కానీ ఈ మహమ్మారిని తరిమికొట్టే యుద్ధానికి మాత్రం ప్రజలు ఎంతో ఐక్యతతో వ్యవహరిస్తున్నారు’ ఆయన వివరించారు.అయితే, వుహాన్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేసినప్పుడు వారు అక్కడ జీవాయుధాన్ని వదిలి వెళ్లారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఫంగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం, మా కార్యాలయం ఒకే బ్లాక్‌లో ఉన్నాయి. వాళ్లు ఒకవేళ జీవ ఆయుధాలను ఇక్కడ వదిలి వెళ్తే మేం విషపూరితమై చనిపోయేవాళ్లం’ అని పేర్కొన్నారు.చైనాలోని హుబే ప్రావిన్సుల్లో 2వేల మందికి పైగా హాంకాంగ్‌ వాసులు చిక్కుకున్నారనీ.. వారిని స్వస్థలాలకు తరలించడం పెద్ద సమస్యగా మారిందన్నారు. వుహాన్‌లో చిక్కుకున్న చాలామంది హాంకాంగ్‌ పౌరులు తమ ప్రాంతానికి వెళ్లాలని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒంటరిగా ఉండేవారిని తీసుకొచ్చేందుకు హాంకాంగ్‌లోని తన సహచరులు ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఈ ప్రావిన్సుల్లో చెల్లా చెదురుగా ఉన్నవారిని తీసుకెళ్లడం మాత్రం పెద్ద సవాలేనని తెలియజేశారు.వుహాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది నిజంగా చాలా పెద్ద తలనొప్పి.. హాంకాంగ్‌ ప్రజల సహకారం కోసం మేం ఫోన్‌, వియ్‌చాట్‌, ఈమెయిల్‌, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నామన్నారు. హాంకాంగ్‌లోని అన్ని శాఖలతోనూ నిరంతరం టచ్‌లో ఉంటూ వాని సమన్వయంతో తమ బృందం పనిచేస్తూనే ఉందన్నారు. అంతేకాదు ఈ రోజు ఏ తేదీ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, తైవాన్‌లో ఈ ప్రాణాంతక వైరస్ సోకిన ఇద్దరు కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. థాయ్‌లాండ్‌లో చైనా ప్రయాణికులను తన వాహనంలో ఎక్కించుకున్న ట్యాక్సీ డ్రైవర్‌ (50)కు కరోనా వైరస్ సోకగా.. అతడిని వైద్యులు నిరంతరం పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకున్నాడు. ఈ వైరస్ బారినపడ్డ మరో మహిళ (55) ఆస్పత్రిలో చేరి పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జి అయినట్టు తైవాన్‌ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

Related Posts