గుంటూరు,
రాజధాని జిల్లా గుంటూరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలో ఉన్న సమయంలో ఈ జిల్లాలో అనేక విధాల అభివృద్దిని చేపట్టారు. అదే సమయంలో 2014లో ఇక్కడ నుంచి మేజర్ నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఎక్కడ చూసినా టీడీపీ జెండాలు కనిపించేవి. ఎక్కడ విన్నా టీడీపీ మాట వినిపించేది. 2014లో ఒక్క బాపట్ల, గుంటూరు తూర్పు, మాచర్ల మినహా అన్ని నియోజక వర్గాల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి.. విజయాన్ని ఆస్వాదించింది. అయితే, 2019 విషయానికి వచ్చే సరికి మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిందిరేపల్లె, గుంటూరు వెస్ట్ మినహా ఎక్కడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కలేదు. పైగా గుంటూరు వెస్ట్ నుంచి విజయం సాధించిన మద్దాలి గిరిధర్ పార్టీకి దూరమయ్యారు. ఆయన వైసీపీకి జై కొడుతున్నారు. మరి ఇప్పుడు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, గుంటూరు ఎంపీ స్థానం మాత్రం అప్పుడు ఇప్పుడు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది. అయినా కూడా ఈ నియోజవకర్గంలో పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఊసు పెద్దగా కనిపించడం లేదు. నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు.ఇక నరసారావుపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ నుంచి యోధానుయోధులైన నాయకులు ఉన్నారు. వీరంతా గప్చుప్గా ఉంటున్నారు. పైగా గుంటూరులోని టీడీపీ నాయకుల్లో మెజారిటీ పార్ట్ చంద్రబాబు సామాజిక వర్గం కమ్మకు చెందిన వారే అయితే, ఇప్పుడు వారు కేసుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. యరపతి నేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటి సీనియర్లు కూడా పెద్దగా బయటకు రావడం లేదు. వీళ్లు గుర్తు వచ్చినప్పుడు ప్రెస్మీట్లు పెట్టడం మినహా ఏం చేయడం లేదనిపిస్తోంది.అయితే, గుడ్డిలో మెల్లమాదిరిగా కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఊపు కనిపిస్తోంది. బాపట్లలో వేగేశ్న నరేంద్ర వర్మ దూకుడుగా ఉన్నారు. గత ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఇక్కడ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తోన్న వర్మ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోయినా టీడీపీ కార్యక్రమాల విషయంలో స్పీడ్గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిన అన్నం సతీష్ తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మరీ బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక్కడ వర్మ పార్టీ కోసం కష్టపడుతున్నా చంద్రబాబు మాత్రం ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జ్ మాత్రం ఇవ్వలేదు.అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా నరసరావుపేటలోనూ టీడీపీ నాయకుడు, పార్టీ ఇన్చార్జ్ చదలవాడ అరవిందబాబు దూకుడుగా పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రెండు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ దూకుడు కనిపిస్తోందనేది వాస్తవం. ఈ రెండు చోట్లా టీడీపీ చివరి సారిగా 1999లో మాత్రమే విజయం సాధించింది. అలాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు పార్టీ దూకుడు మీద ఉండడం జిల్లా పార్టీ నాయకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.