ప్రశాంతంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు 672 మంది పోటీ
న్యూఢిల్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆప్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం సందర్భంగా ఆప్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. మతవిద్వేష, జాతీయ ఉన్మాద అంశాలే ప్రధానంగా బిజెపి నేతలు ప్రచారం చేయగా, ఆప్ బిజెపికి కౌంటర్ ఇస్తూనే తమ పాలనను చూసి ఓటేయాలని అభ్యర్ధించింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ చాలా వరకూ నూతన అభ్యర్ధులతో బరిలోకి దిగింది. ఈ నెల 11న ఫలితాలు విడుదల అవుతాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 672 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యల్పంగా పటేల్ నగర్ నుంచి కేవలం నలుగురు పోటీచేస్తున్నారు. కోటి 47 లక్షల మంది ఓటర్లుకు గాను 13,750 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 190 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సిఎపిఎఫ్), 19 వేల మంది హోంగార్డులు, 42 వేల మంది స్థానిక పోలీసులను వినియోగిస్తున్నారు.