ఏపీలో జిల్లాల వార్
విజయవాడ, ఫిబ్రవరి 10,
ఏపీలో జిల్లాల సంఖ్య పెరిగింది. పదమూడు నుంచి పదహారుకు పెరిగింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన జగన్ తొలుత మూడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో అదనంగా మరో జిల్లాను ఏర్పాటు చేశారు. విశాఖలో అరకు, గుంటూరులో నరసరావుపేట, కృష్ణా జిల్లాలో విజయవాడను కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారు.అయితే వీటిని హడావిడిగా ఏర్పాటు చేసింది వైద్య కళాశాలల కోసమే. ఇప్పుడు ప్రకటించిన మూడు జిల్లాలు పార్లమెంటు నియోజకవర్గాలే కావడం గమనార్హం. ఒకే జిల్లాలో రెండు వైద్య కళశాలలు లేకుండా ఉండేందుకు కొత్త జిల్లాలను జగన్ ఏర్పాటు చేశారు. అరకు, మచిలీపట్నం, గురజాలలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. వైద్యవసతి సరిగా లేని జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే భారత వైద్య మండలి 60 శాతం నిధులను కేటాయిస్తుంది. అందుకోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.అయితే జిల్లా కేంద్రాన్ని గురజాలలో ఏర్పాటు చేయాలని కాసు మహేష్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పల్నాడులో వెనకబడిన ప్రాంతం కావడంతో జిల్లా కేంద్రం కూడా తమకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుకు భౌగోళిక పరిస్థితులు అంచనా వేసే పనిని ఇప్పటికే జగన్ అధికారులకు అప్పగించారు. ఆ జిల్లాల్లో ఏ మండలాలను కలిపితే బాగుంటుందనేది క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయించాలని జగన్ ఆదేశించారు.అయితే ఇప్పటికే నరసరావుపేటలో జిల్లా కేంద్రం ఉంచాలని కొందరు ఆందోళన చేస్తున్నారు. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎట్టిపరిస్థితుల్లో నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేసితీరాలని అంటున్నారు. విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకపోయినప్పటికీ, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల మధ్య జిల్లా కేంద్రం విభేదాలు సృష్టించిందనే చెప్పాలి. నరసరావు పేట టిక్కెట్ విషయంలోనూ ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి జిల్లా కేంద్రం విషయంలో జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.