తెలంగాణ కమలంలో మూడు ముక్కలాట
హైద్రాబాద్, ఫిబ్రవరి 10,
వారు గెలచారని అక్కసా? లేక తమకంటే ఎదగకూడదన్న కారణమో తెలియదు కాని తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా పెద్ద వారే నడుస్తున్నట్లు కనపడుతోంది. తెలంగాణలో కష్టపడితే ఎప్పటికైనా ఎదగగలుగుతామని కేంద్ర నాయకత్వం గట్టిగా నమ్ముతుంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కొద్దో గొప్పో అవకాశాలు బీజేపీకి తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ ఏమాత్రం పుంజుకునే పరిస్థితి కన్పించడం లేదన్నది మాత్రం వాస్తవం.తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి కేవలం ఏడుగురు ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. వారిలో నలుగురు పార్లమెంటు సభ్యులు కాగా, ఒకరు రాజ్యసభ సభ్యులు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ తెలంగాణలో బీజేపీ తరుపున ఉన్నారు. వీరే ఆ ప్రాంతాల్లో కొద్దో గొప్పో పార్టీకి అండగా ఉంటున్నారు. వీరిలో పార్టీతో పాటు వ్యక్తిగత ప్రభావం చూపడం వల్లనే ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చాయన్నది కాదనలేని వాస్తవం. కానీ ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ పెద్దలు మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు.నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్నామని, తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజీపీ నేతలు పదే పదే డప్పాలు కొడుతుంటారు. కానీ తమ పార్టీ నేతలకు అండగా ఉండటానికి మాత్రం ఇష్టపడరు. రాజాసింగ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించినా బీజీపీ పెద్దలు అండగా నిలబడలేదు. కనీసం పరామర్శించలేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సిన మెటీరియల్ ను కూడా అందజేయలేదు. దీంతో పార్టీ వైఖరి కారణంగానే తాను అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఆర్టీసీ సమ్మె సమయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించినా పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా మీడియా సమావేశం పెట్టి ఊరుకున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పసుపు బోర్డు స్థానంలో స్పైసిస్ రీజనల్ బోర్డు రావడంపై అరవింద్ ను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారు. అయినా అరవింద్ కు సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇలా బీజేపీ పెద్దలు తమ నేతలకు ఏం జిరిగినా పట్టించుకోవడం లేదని, ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.