రిజర్వేషన్లపై లోక్ సభలో చర్చ
న్యూఢిల్లీ ఫిబ్రవరి 10
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. రిజర్వేషన్ల కోటా అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని ఎన్డీయేతర ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై విపక్ష ఎంపీలు సభలో ఆందోళనకు దిగడంతో.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఇది సున్నిత అంశమని, కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం తగదు అని ఆయన అన్నారు. రిజర్వేషన్ల కోటా అంశంపై సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లోక్సభలో మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రకటన చేస్తారని రాజ్నాథ్ సభలో తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ వేయాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పదోన్నతుల్లో కోటా పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఉత్తరాఖండ్ కేసులో శుక్రవారం తేల్చిచెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై కాంగ్రెస్తోపాటు లోక్జనశక్తి పార్టీ అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని వ్యా ఖ్యానించాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2012 సెప్టెంబర్ 5వ తేదీన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అందులో ప్రజా పనుల విభాగంలోని అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) పోస్టులకు సంబంధించి పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించరాదని నిర్ణయించింది. దీనిపై ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, నియామకాలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్లు ఎల్ నాగేశ్వర్రావు, హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, కొలిన్ గొంజాల్వెజ్, దుష్యంత్ దేవ్ వాదనలు వినిపించారు. ఆర్టికల్ 16(4), 14(4-ఏ) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వం విధి అని పేర్కొన్నారు. ఈ వాదనలను ప్రభుత్వం తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘గతంలో మేము నిర్దేశించిన చట్టం ప్రకారం.. నిస్సందేహంగా రాష్ర్టాలు రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రాథమిక హక్కు అని ఏ ఒక్కరూ వాదించరాదు’ అని స్పష్టంచేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు (మాండమస్) జారీ చేయజాలదని చెప్పింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించరాదని చట్టంలో స్పష్టంగా ఉన్నది’ అని ధర్మాసనం పేర్కొన్నది. అది వెసులుబాటు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు తగినంత సంఖ్యలో లేరని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే నియామకాలు, పదోన్నతుల్లో వారికి రిజర్వేషన్లు అమలుచేసే అధికారాన్ని ఆర్టికల్ 16(4), 14(4-ఏ) కట్టబెడుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. అదేసమయంలో కచ్చితంగా కోటా అమలు చేయాలని ఎక్కడా పొందుపరుచలేదని తెలిపింది. ‘ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కోటా ఇవ్వాలని భావిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రాధాన్యం లేదని నిరూపించే సమాచారం సేకరించాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.